10.6.09

నిజమైన గురువు-1




రువుగారిని మనందఱిలాంటి మామూలు మనిషిగా చూడ్డం, ఆ భావనలో ఆయన పట్ల వాచికంగా, కాయికంగా, మానసికంగా అనేక అపచారాలు చేసి పాపాన్ని మూటగట్టుకోవడం - ఇదంతా ఆంగ్లవిద్యా విధానం ద్వారాను, సినిమాల ద్వారాను మనం నేర్చుకున్న ఒక అభ్యంతరకరమైన జీవన విధానం. పాశ్చాత్య జీవన వేదాంతంలో తల్లి, తండ్రి, గురువు, అన్నయ్య, భర్త - వీళ్ళకి Elders గానో, Equals గానో తప్ప దైవసమానమైన పూజ్యులుగా పరిగణన లేదు. కాని మనకి మాత్రం Elder అనేది కేవలం Senior in terms of age కాదు, అది పూజ్యతకి పర్యాయపదం. పెద్ద లెవరైనా గానీ, వాళ్ళంతా గురువులే. అందుచేత సంస్కృత సాహిత్యమంతటా ’గురు’ శబ్దం కేవలం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికే కాక పెద్దలందఱినీ ఉద్దేశించి ఉపయోగించారు. కాబట్టి గురుసేవ, గురుపత్ని, గురుద్రోహం, గురుశాపం లాంటి పదాల పరిధి చాలా విస్తృతమైనది.

మనుషులు వావివరుసలతో కాక పేర్లతోను, మళ్ళీ ఆ పేర్లలో కూడా ఏకవచనాలతోను పిల్చుకుంటే పూజ్యభావం ఏర్పడ్డం కష్టం. ఎందుకంటే సింబాలిక్ గా భావించబడే విషయాలు చిన్నవి కావు, వాస్తవానికి చాలా పెద్దవి. అవి కొన్ని భవిష్యత్ సంఘటనల్ని తమలో దాచుకుని ఉంటాయి. పూజ్యతకి ఒక సోపానక్రమం (hierarchy) ఉంది. పైవాళ్ళని చూసి కిందివాళ్ళు నేర్చుకుంటారు. అలాగే పైవాళ్ళు తమ పైవాళ్ళని గౌరవిస్తే వాళ్ళ కిందివాళ్ళు వాళ్ళని గౌరవిస్తారు. ఈ గౌరవం మనుషుల పరస్పర బాధ్యతని పెంచుతుంది. గౌరవం లేనిచోట బాధ్యతని అనుభూతి చెందడం అసాధ్యం. బాధ్యతే కాదు, గౌరవం పోయాక ప్రేమ కూడా నశించిపోతుంది. తాను ప్రేమించిన స్త్రీ దుశ్శీలురాలని తెలిశాక కూడా ఆమె ప్రియుడు అంతకుముందులా ఆమెకి అంకితం కాలేడు. కనుక ప్రేమ కంటే గౌరవం ప్రాథమికమైనది. ప్రేమ ఉండొచ్చు గాని దానిది ఎప్పటికీ తరువాతి స్థానం మాత్రమే.

"గురుద్రోహుల మాటేమో గానీ ఈ కాలంలో శిష్యద్రోహులు ఎక్కువైపోయారండీ" అన్నారొకసారి నా మిత్రుడు శ్రీ చిలకపాటి వెంకట కృష్ణమాచార్యులు గారు చిలకనవ్వు నవ్వుతూ. నేను నమ్ముతానో లేదోనని ఆయన సంశయం. నేను నమ్ముతాను. ఎందుకంటే, చాలా సంవత్సరాల క్రితం నేను స్వయంగా అటువంటి ఒక గురువుని ఒక విశ్వవిద్యాలయంలో చూశాను. అతను తన దగ్గఱ పరిశోధన చేసే శిష్యురాళ్ళెవరినీ ఊరికే వదలడనే పేరుండేది. అతని అసలుపేరు "రామ..." అయితే, జనం దాన్ని "కామ..." అని మార్చి వ్యవహరించడం విన్నాను. అదే విధంగా శిష్యుల మీద కక్షగట్టడం, కులం, మతం, జాతి, ప్రాంతం మొదలైన ప్రాతిపదికల మీద వాళ్ళకి అన్యాయం చెయ్యడం - ఇదంతా ఘోరమైన పాపకర్మ (a heavy-duty sin). ఇలా పూజ్యమైన, గురుస్థానాన్ని, మహోన్నతమైన గురుపీఠాన్ని దుర్వినియోగం చేస్తే దాని భావి పరిణామాలు దారుణంగా ఉంటాయి. అదంతా ఇప్పుడిక్కడ రాయడం సాధ్యపడదు.

మఱి "పూజ్యస్థానాల్లో ఉన్న సన్నిహితులు నీతి తప్పి ప్రవర్తించిన పక్షంలో ఏం చెయ్యాలి ?" అనడిగినప్పుడు, నిజాయితీగా సమాధానం చెప్పాల్సి వస్తే "మనం చెయ్యగలిగిందేమీ లేదు" అనే నా సమాధానం. ఇది కటువుగా, మూర్ఖంగా ధ్వనిస్తుంది. ఇలా చెబితే ఈ రోజుల్లో ఎవరూ వినరు కూడా. ఎందుకంటే ఇలాంటివి చెప్పినంత సులభం కాదు. కానీ కొన్ని సజీవ దృష్టాంతాల్ని చూసినప్పుడు అసాధ్యం కాదనిపిస్తుంది. మా మిత్రుడికి అన్యాయం చేసి అతని సొంత అన్న వందకోట్ల పిత్రార్జిత ఆస్తిని చేజిక్కించుకున్నాడు. నా మిత్రుడు మనసులో చాలా దుఃఖపడ్డాడు తప్ప అన్నమీద న్యాయస్థానంలో వ్యాజ్యం కూడా వెయ్యడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ క్రీడల కోచ్ గా పనిచేస్తూ జీవితం లాగిస్తున్నాడు. తనకు జఱిగిన అన్యాయానికి అన్నగారిని ఎప్పుడూ దూషించి కూడా ఎఱగడు. దేవుడు ఈ విధమైన సహనాన్ని తప్పకుండా మెచ్చుకుంటాడు. అతని ప్రవర్తన రీత్యా అతనికొక గొప్ప భవిష్యత్తుని సిద్ధం చేసే ఉంటాడు.

దారితప్పిన పెద్దల్ని ప్రభుత్వ సహాయం/ సంఘపెద్దల సహాయం తీసుకొని శిక్షించవచ్చు, అంతే ! కాని దానివల్ల ప్రస్తుతానికి మన అవసరం గడిచినా, వారి శాపాలు తప్పనిసరిగా తగుల్తాయి కనుక మనం భవిష్యత్తులో మళ్ళీ ఇఱుక్కు పోయినట్లే. కొందఱు భావిస్తున్నట్లు, దుష్టులైనంత మాత్రాన పెద్దల శాపాలకి శక్తి లేదనుకోవడం అమాయకత్వం మాత్రమే. అలాగే, "మేమిలాంటివి నమ్మం, లేదా మాకిలాంటివి తెలియవు, లేదా ఎవరూ మాతో అనలేదు కనుక మా మీద గురుశాప ప్రభావం ఉండ"దనుకోవడం కూడా వెఱ్ఱితనమే. మానవజాతి చరిత్రలో అనేక వేల సంవత్సరాల పాటు ఆడవాళ్ళు ఎందుకు గర్భం ధరిస్తారో తెలియలేదు. అంతమాత్రాన వాళ్లకి గర్భాలు రాకుండా పోలేదు. పెద్దలు ఏ ఉన్నతపీఠం నుంచి ఆ శాపాలిస్తున్నారనేది గమనించాలి. శాపానుగ్రహ శక్తి వారిది కాదు, ఆ పీఠానిది. అది పీఠమే గాని, వ్యక్తి కాకపోవడం చేత అక్కడ లింగ వయోభేదాలకి తావు లేదు. వారిని ఆ దివ్యపీఠం మీద దేవుడు కూర్చోబెట్టడం మన దురదృష్టం. వారిని ఎదిరించి వారి శాపాలకి గుఱయ్యే బదులు, వారు మనకి చేసే అన్యాయాల్ని ప్రస్తుతానికి ఓర్పుగా భరించడమే మంచిది. ఎందుకంటే మన దురదృష్టం అంతటితో వెళ్ళిపోతుంది. ఆ తరువాత మధురమైన కొత్త జీవితం ప్రారంభమవుతుంది. వారు మనకు చేసిన అన్యాయాన్ని, దాని పాపఫలాన్ని వారినే మోయనివ్వండి. వారిమీద మఱొకడు తప్పకుండా ఉన్నాడని, ఆయన న్యాయబుద్ధి సర్వోత్కృష్టమైనదనీ, ఆయన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాడనీ విశ్వసించాలి. మనకి వ్యక్తిగతంగా తారసపడ్డ పెద్దలు దుష్టులైనంత మాత్రాన పెద్దలందఱూ దుష్టులేననే సంకుచిత ద్వేషభావనకి లోనుకాకుండా, ఆ భావాన్ని ప్రచారం చెయ్యకుండా జాగ్రత్త వహించాలి. పెద్దఱికపు గొప్పతనం మీద నమ్మకం కోల్పోని మనో నిలకడని నిలబెట్టుకోవాలి. అప్పుడు జన్మజన్మలకీ చెక్కుచెదఱని గుర్వాశీర్వాద బలం, లభించాల్సిన చోటినుంచి మనకి లభిస్తుంది. అది చాలా మహిమాన్వితమైనది.

పాతికేళ్ళపాటు కని పెంచి పోషించిన తల్లిదండ్రుల కంటే నాలుగు పాఠాలు చెప్పిన గురువు గొప్పవాడని చెప్పినప్పుడు మహా మహా హిందువులే నమ్మలేక ఆశ్చర్యంతో నోరు తెఱుస్తారంటే, ఇహ వేఱే సంప్రదాయాల వారి మాట చెప్పేదేముంది ? కానీ ఇది వాస్తవం. దేవుడి కంటే గురువే గొప్పవాడని చెబుతుంది హిందూమతం. తనని దూషించినా దేవుడు సహిస్తాడు. కానీ గురువుని దూషించి తనకు పూజ చేస్తే ఆయన ఆగ్రహోదగ్రుడై ఆ పూజని నిర్దాక్షిణ్యంగా నేలకేసి కొడతాడు. అదే విధంగా "శాస్త్రం చెప్పింది నిజమా ? గురువు చెప్పింది నిజమా ? అనే సంశయం మీకేర్పడినప్పుడు శాస్త్రాన్ని త్రోసిపుచ్చండి, మీ గురువునే అనుసరించండి" అని నిర్మొహమాటంగా చెబుతున్నాయి హిందూశాస్త్రాలు. సాధారణంగా భగవంతుణ్ణి తల్లిగానో, తండ్రిగానో సంబోధించడానికి మనం మొగ్గు చూపుతాం. అయితే భగవంతుడు తన స్వభావరీత్యా దేన్నీ అంటిముట్టని, ఎవరినీ ప్రేమించని, ఎవరినీ ద్వేషించని సన్న్యాసి, ఫకీరు. ఆయనకి "తల్లిదండ్రులు" మొదలైన కౌటుంబిక వావివరుసల కంటేను, అటాచిమెంట్ల కంటేను నిష్పక్షపాత సూచకమైన "గురు"నామం మఱియు గురుపీఠం మిక్కిలి ప్రీతికరమైనవి. లౌకిక గురువు కూడా భగవంతుడిలాగే తన శిష్యుల్ని వారివారి యోగ్యతని బట్టి అభిమానిస్తాడు కనుక ఆయనలోనే ఈ భగవత్తత్త్వం ప్రస్ఫుటంగా ప్రకాశమానం అవుతుంది. ఇందుకు విరుద్ధంగా - లౌకిక తల్లిదండ్రులు తమ బిడ్డల్ని వారి యోగ్యతలతో నిమిత్తం లేకుండా పిచ్చిగా అభిమానిస్తారు. తద్ద్వారా వారు తమ బిడ్డల పాపపుణ్యాల్లో పాలు పంచుకొని దేవుడికి దూరమవుతారు. మీరొక అవకాశం ఇచ్చి చూస్తే ప్రతితల్లీ తన బిడ్డ పదివేల సంవత్సరాల పాటు బతకాలని ఆశీర్వదిస్తుంది.

అందుచేత గురువుల తప్పల్ని మనసులో పెట్టుకోకూడదు. వాటి గుఱించి ఇతరులతో గోష్ఠి చెయ్యకూడదు. గురునింద జఱిగే చోట ఉండకూడదు. అటువంటివారితో చెలిమి కూడా చెయ్యకూడదు. గురువుల పరంగా - గురువంటే ఎల్లప్పుడూ శిష్యుడి మేలు కోరేవాడు, అతన్ని తనంతటివాడుగా, తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నవాడు అయి ఉండాలి. శిష్యుణ్ణి బయటి వ్యక్తిలా కాక సొంత కొడుకులా, తన వారసుడుగా భావించి ఆదరించాలి. తన కుమారుల్లో అతను కూడా ఒకడని తలపోయాలి. శిష్యుడి ద్వారా తాను పైకి రావాలనే పన్నాగాలు పన్నకుండా తన మూలంగా శిష్యుడు పైకి రావాలనే సంకల్పాన్ని కలిగి ఉండాలి. ఈ సందర్భంగా గురువులకే గురువైన మహాగురువు శ్రీ షిరిడీ సాయిబాబావారు తమ గురువుగారి పట్ల, తమ శిష్యుల పట్ల ఎలా వ్యవహరించారో తెలుసుకుంటే మనం కూడా దాన్ని అనుసరించాలనే ప్రేరణ కలుగుతుంది.


(ముగింపు వచ్చే టపాలో....)

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్