తె.రా.స. పార్టీని స్థాపించిన కొత్తల్లో దాని అధ్యక్షుడు ఎవరికీ తెలియని ఒక అపూర్వ చారిత్రిక సత్యాన్ని ఆవిష్కరించి అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని దిగ్భ్రాంతిలో ముంచాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ "అమాయక తెలంగాణాని గడసరి ఆంధ్రా చేతుల్లో పెడుతున్నాను" అన్నాడట. అంతేకాదు, "ఆంధ్రా నుంచి తెలంగాణా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చు"నని కూడా సెలవిచ్చాడట. తద్ద్వారా పెళ్లినాడే నెహ్రూ విడాకుల మంత్రాలు కూడా చదివేశాడని తె.రా.స. భాష్యం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే (క్రీ.శ. ౧౯౫౬) నాటికి ఊహ తెలిసి వయసొచ్చి ఉన్న చాలామంది సీనియర్లు కూడా ఈ ప్రచారానికి "ఎట్టెట్టా ?" అని ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. తొలి తెలంగాణా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన చెన్నారెడ్డికే తెలియని విషయాలు, పెద్ద మనుషుల ఒప్పందం మీద స్వయంగా సంతకం చేసిన ఆ చెన్నారెడ్డే ఏనాడూ ప్రస్తావించని వివరాలు చంద్రశేఖరరావుకి ఎలా తెలుసో అది మనం అడక్కూడదు - అప్పటికి శ్రీమాన్ చం.శే.రా. గారు పాలు తాగుతున్న పసిబిడ్డ మాత్రమేనన్న వాస్తవం మనకి తెలిసినా సరే ! కీ.శే. పండిత నెహ్రూ ఇలాంటి అసందర్భపు మాటలు మాట్లాడే మనిషి కాదనే నమ్మకం ఉన్నవాళ్ళు "ఈ మాటలకు ఆధారాలేం"టని అడిగీ అడిగీ విసిగిపోయారు తప్ప తె.రా.స. అధ్యక్షుడు మటుకు ఈరోజు దాకా తన సొంత చారిత్రిక సత్యాలకి ఆధారాలు చూపించిన పాపాన పోలేదు. నెహ్రూ చిన్నా, చితకా మనిషి కాదని మనందరికీ తెలుసు. ఆయన ఏం మాట్లాడినా అది ప్రసార మాధ్యమాల్లో నమోదై తీరుతుందని కూడా మనకి తెలుసు. మఱి నిజంగా ఇంత వివాదాస్పదమైన ఉద్ఘాటనలు (statements) ఆయన చేసి ఉంటే, అవి ఆనాటి జాతీయ దినపత్రికలన్నింటిలోను ఆగమేఘాల మీద రాకుండా ఉండవే ! చాలా దినపత్రికలు తమ పూర్వసంవత్సరాల సంచికల్ని జాగ్రత్తగా భద్రపరుస్తాయి. అటువంటివాటిల్లో తెలంగాణా గడ్డమీదనే దశాబ్దాలుగా ప్రచురితమౌతున్న Deccan Chronicle కూడా ఉంది. వాళ్ళెవరూ చంద్రశేఖరరావు వాదనకి మద్ధతుగా తమ పాతసంచికల భాండాగారాల్లోంచి ఒక్కటైనా బయటికి తీశారు కాదు.
రాజకీయస్వార్థాల కోసం లేనివివాదాల్ని సృష్టించడమంటే ఇది.
సుమారు రెండు దశాబ్దాల క్రితం 'కాపునాడు' అనే సంస్థ శ్రీకృష్ణదేవరాయలు తమ కులస్తుడని ప్రకటించినప్పుడు ఇంతకంటే ఎక్కువ దిగ్భ్రాంతి కలిగింది. భారతదేశ చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలకున్న ప్రాధాన్యం సంగతి వేఱే విడమర్చ నక్కఱలేదు. తెలుగుభాషలో ఆయన మీద వచ్చినన్ని పుస్తకాలు గానీ, సినిమాలు గానీ వేఱే ఏ ఇతర చక్రవర్తి మీదా వచ్చి ఉండలేదు. కారణం - మనకి ఆయన గుఱించి చాలా విపులమైన వివరాలు తెలియడం, ఆయన రాసిన పుస్తకాలు కూడా విఱివిగా లభ్యమౌతూండడం. ఆయన తన గుఱించి తాను స్వయంగా కంఠోక్తిగా చెప్పుకున్నది మాత్రం క్షత్రియుణ్ణని ! నాకర్థం కానిదేంటంటే - మన ఊహాపోహలకే తప్ప ఒక వ్యక్తి తన గుఱించి తాను చెప్పుకునే వివరాలకి ఏమీ విలువ లేదా ? అని ! నీ తండ్రి పేరు అప్పారావయితే, అదే మాట నువ్వు నెత్తీ, నోరూ కొట్టుకొని చెబుతూంటే, వినకుండా "కాదు, నీ తండ్రి పాపారా"వని వాదించేవాణ్ణి నువ్వు మీదపడి కొట్టవా ? శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి రాక ముందు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినది ఆయన అన్నగారైన నరసింహరాయలు. ఆయన క్షత్రియుడు కనుకా, వారి తండ్రి కూడా క్షత్రియుడే కనుకా ఇందులో అనుమానించాల్సిందేమీ మనకి కనిపించదు. శ్రీకృష్ణదేవరాయలకి తమ కావ్యాలు అంకితమిచ్చిన కవులున్నారు. వారు తమ కావ్యావతారికల్లో ఆయన్ని క్షత్రియుడనే పేర్కొన్నారు. చూడబోతే ఆయన కర్ణాటక పశ్చిమ తీరానికి చెందిన తుళుభాషేయుడు. తెలుగు ఆయనకి నేర్చుకున్న భాషే తప్ప మాతృభాష కాదు. ఆయన కాపు కాదనడానికి ఇంత బలమైన చారిత్రికాధారాలుండగా - ఎంత కులాభిమానమున్నా ఇంత బహిరంగంగా ఇలాంటి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికి మనసెలా ఒప్పుతుందో నాకు తెలియదు.
కులస్వార్థాలకోసం లేని-వివాదాల్ని సృష్టించడమంటే ఇది.
ఈమధ్య ఇంకో వివాదం వింటున్నాను. కామసూత్రాలు వ్రాసిన వాత్స్యాయనుడు పురుషుడా ? స్త్రీనా ? అని చర్చ. ఈ వివాదాన్ని మొదటిసారిగా లేవనెత్తినది ఈనాడు దినపత్రిక. అందులో ఒక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన వ్యాసంలో సదరు వ్యాసకర్త (వ్యాసకర్త్రి ?) ఈ అనుమానాన్ని వ్యక్తం చెయ్యడం జరిగింది. ఈ అనుమానానికి కారణమట, రతిలో స్త్రీ ఎలా తృప్తి చెందుతుందో, ఆమె స్వభావమేంటో వాత్స్యాయనుడు చక్కగా వివరించడమేనట. ఇక్కడ పట్టుబడిపోయారు. ఈ వ్యాసం రాసింది ఎవరా ? అని చూస్తే పేరు కనిపించలేదు. మన దేశ వాతావరణాన్ని బట్టి ఇలా సెక్సు వ్యాసాలు అనామకంగా రాసేవారు సాధారణంగా స్త్రీలే అయ్యుంటారని ఊహించవచ్చు. స్త్రీల శృంగార స్వభావం తెలియడానికి మనిషి స్త్రీజన్మెత్త నక్కఱలేదు, స్త్రీల లో-దుస్తులు డిజైన్ చేసేవారు స్త్రీలు కానట్లే !
నాకు గుంటూరులో ఒక బాల్యమిత్రుడుండేవాడు. అక్కడ ఎలెక్ట్రీషియన్ గా పనిచేసేవాడు. నిరంతర కామవాంఛా పీడితుడు. అతనికి అనేకమంది సంసార స్త్రీలతో సంబంధాలుండేవి. తన అనుభవాల రీత్యా నాకు చాలా విషయాలు చెబుతూండేవాడు. అతను స్వతహాగా రచయిత కాడు గానీ అయ్యుంటే మాత్రం అతను చెప్పే విషయాలు హాట్కేకుల్లా అమ్ముడు పోతాయనుకునేవాణ్ణి. వాత్స్యాయనుడు కూడా అలాంటి వేయిగుళ్ళ పూజారి కావచ్చు.
ఇంకొకటి. ఇలా ఆలోచించేవారికి ప్రాచీనకాలంలో పుస్తకాలు ఎలా వ్యాప్తి చెందేవో తెలియదనిపిస్తుంది. ఈ కాలంలో మాదిరి మాఱుపేర్లతో అనామకంగా రాతలు రాసి ప్రసిద్ధికెక్కడం ఆ రోజుల్లో సాధ్యపడేది కాదు. ఒక స్త్రీ మగపేరు పెట్టుకునో, లేదా ఒక మగవాడు ఆడపేరు పెట్టుకునో ఆ రోజుల్లో తమ రాతల్ని చెలామణీలోకి తేగలిగేవారు కారు. ఒక ముఖ్యకారణం - ముద్రణ, తన్మూలకంగా జరిగే పుస్తకప్రతుల భారీ ఉత్పత్తి, వాటి శీఘ్ర రవాణా అప్పుడు తెలియకపోవడం. ఏదైనా చేత్తో రాసుకోవలసిందే. కొన్ని పుస్తకాలైతే అలా రాసుకోవడానికి ఏళ్ళూ పూళ్ళూ పట్టేది. అందుచేత ఏది పడితే అది కాకుండా పండితులు యోగ్యమైన పుస్తకాలని నిర్ణయించినవి మాత్రమే రాసుకొనేవారు. సాహిత్యపు యోగ్యతల్ని చర్చించడానికి ప్రతి పెద్ద పట్టణంలోను పండిత సభలుండేవి. వాటి గుఱించి మనం నన్నయగారి భారతావతారికలోను, కాళిదాసు చరిత్రలోను, శ్రీపాద శ్రీవల్లభస్వామి చరిత్రలోను చదవొచ్చు. రచయితలు ఆ పండిత సభలకు తమ రచనలతో సహా వ్యక్తిగతంగా హాజరై వాటిని తమ నోటితో వినిపించి అక్కడివారి సందేహాలకి సంతృప్తికరంగా సమాధానాలు చెప్పిన తరువాతనే పండిత సభలు ఆ పుస్తకానికి ఆమోదముద్ర వేసేవి. ఇతర ప్రాంతాల్లోని పండిత సభలక్కూడా దాన్ని సిఫార్సు చేసేవి. పక్షాంతరంలో కొన్నిసార్లు రాజుగారి ఆమోదం పొందిన పుస్తకాల్ని పెద్దగా చర్చించకుండానే పండిత సభలు ఆమోదించేవి. అలా అది వ్యాప్తి చెందేది. మన కాలం దాకా బతికి బట్టగట్టి వచ్చిన అన్ని పుస్తకాలూ అలా పండిత సభల ఆమోదం పొందినవే. అందుచేత వాత్స్యాయనుడు కూడా అలా స్వయంగా తన పుస్తకంతో పండిత సభలకి హాజరై ఉండొచ్చు.
నేను కూడా వాత్స్యాయన కామసూత్రాలు చదివాను. వ్యక్తిగతంగా నాకేమనిపించిందంటే - మన దేశానికి చెందిన అన్ని ప్రాచీన పుస్తకాల్లానే అది కూడా పురుషుల చేత పురుషుల కొఱకు రచించబడిందని ! స్త్రీలకి నచ్చని విషయాలు చాలా ఉన్నాయి. "పరభార్యల్ని వశం చేసుకొని అనుభవించడం ఎలా ?" అనే అంశం మీద ఒక ప్రత్యేక అధ్యాయాన్నే కేటాయించాడు. విదర్భాది రాజకుటుంబాల స్త్రీలు కామవశాన తమ కన్నకొడుకులతో కూడా కలుస్తారంటాడు (స్వైరేవ పుత్రైర్ విదర్భాణాం...) మగవారు తమ పురుషాంగాల్ని కావలసిన పరిమాణానికి పెంచుకోవడం ఎలా ? అనేదాని మీద ఇంకో అధ్యాయం ఉంది. కాని స్త్రీలు తమ సౌందర్యాన్ని పెంపొందించుకొనే పద్ధతుల గుఱించి అదే స్థాయిలో వివరణల్లేవు.
కామసూత్రాల్ని రాసింది స్త్రీ అయినా, పురుషుడైనా మనకి ఒరిగేది ఏముంది ? అని ఆలోచిస్తే, ఇది మఱో ఫెమినిస్టు పిల్లిమొగ్గలా కనిపిస్తోంది. పురుషులంతా యమా సెక్సుస్వేచ్ఛని అనుభవించేస్తున్నారనే భ్రమలో ఉన్నారు వారు. ఆ ప్రాతిపదిక మీద మిగతా ఆడవాళ్ళని రెచ్చగొట్టాలని వాళ్ళు చాలాకాలం నుంచి ప్రణాళికలు రచిస్తున్నారు. "పదండి ! వెరైటీగా తిరిగేద్దాం !" అంటే మన సాంప్రదాయిక స్త్రీలు వినకపోవచ్చు. స్త్రీలు కూడా వెరైటీ తిరుగుళ్ళు తిరగడం మన సంప్రదాయంలో ఉందని నిరూపిస్తే వాళ్ళలో కాస్త కదలిక రావచ్చు. కనుక వారికొక దేశీయమైన ప్రాఙ్నమూనా (native archetype) కావాలి. అలాంటి స్త్రీలు మన ప్రాచీన సాహిత్యంలో ఆట్టే లభించడంలేదు. కాబట్టి ఒక మగ సెక్సు రచయితనే ఆడదని ప్రచారం చేస్తే పోలే ? ఎవడు చూసొచ్చాడు గనుక ?
నాకిప్పుడు అనుమానంగా ఉంది - ఱేపు ఒక వందేళ్ళ తరువాత లలితాబాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆడదే తప్ప మగవాడు కాదంటారేమోనని ! కాదని చెప్పడానికి నేనప్పటికి బతికి రాలేను గదా ! అలాగే ఆ మధ్య ఒకసారి The Hindu అనే హిందూవ్యతిరేక దినపత్రికలో భగవాన్ శ్రీ వివేకానందస్వాములవారి మీద ఆయన శిష్యురాళ్ళకున్న భక్తిశ్రద్ధల్ని వక్రీకరిస్తూ రాసిన రాత చదివాను. చాలా బాధ కలిగింది. వివిధ స్వార్థాల కోసం మనుషులు ఇలా ఏ వివాదమూ లేని విషయాల్ని పనిగట్టుకొని వివాదాస్పదం చేస్తూంటే వినడానికి చాలా అసహ్యంగా ఉంది. పుకార్ల మీదపడి బతుకుదామనుకునేవారు వీరు. వీరికి మన మేధాశక్తి మీద చాలా చిన్నచూపు. మనకేమీ తెలియదనీ, తాము ఏది చెబితే అదల్లా మనం నమ్మేస్తామనీ, సొంతబుద్ధితో ఆలోచించలేమనీ వీళ్ళు అనుకుంటున్నారు.
అది నిజమేనా ?
28 వ్యాఖ్యలు:
తాడేపల్లి గారు,
నేను చాలా సార్లు నెహ్రూ అలా అన్నారనడానికి ఆధారాలేమైనా ఉన్నాయా అని ప్రయత్నించాను. నాకు దొరకలేదు. ప్రొఫెసర్ జయశంకర్ ఉపన్యాసాలు, ఒక తెలంగాణ వెబ్సైట్ చూపిస్తారు కొంతమంది ఆ వాదాన్ని సమర్ధించేవాళ్ళు.అది వివాదాస్పదమే..
ఇంకా.. ప్రతీ దానికి ఆంధ్రా వాళ్ళు అణిచివేస్తున్నారు,దోచుకుంటున్నారు అనేదానికి కూడా ఎంత ప్రయత్నించినా నాకు ఆధారాలు కనబడలేదు.కానీ, కొంత మంది తెలంగాణా రాజకీయ నాయకుల వాదాలకి ప్రజలు వాటిని పూర్తిగా నమ్మే స్థితికి వచ్చేసారు. నేను మాట్లాడే తెలంగాణా యువకులు ఆ ప్రాంతం అభివృద్ధి జరగకపోవడానికి అక్కడ యాభై ఏళ్ళుగా ఎన్నికవుతున్న 100కు పైగా ఉన్న ప్రతినిధులు అని ఒప్పుకోడానికి సిద్ధంగా లేరు, చాలా సులభంగా ఆంధ్రా నాయకుల మీదకి నెట్టేస్తారు. ఎంత బుర్ర గోక్కున్నా అది నాకు అర్ధం కాదు..
అలానే శ్రీ కృష్ణ దేవరాయలు విషయం కూడా, ఇరవై ఏళ్ళ క్రితం వరకు ఏ విధంగానూ కాపులు పోల్చుకోని ఒక చారిత్రక పురుషుడుని ఆకస్మికంగా కాపునాడు మా వాడు అని ప్రకటించుకోవడం దానికి ఎవరో ఆంగ్లేయుడు ఎక్కడో విజయనగర నాయకులు బలిజలకి చెందిన వారయి ఉండొచ్చు అని సూచించడాన్ని ఆధారంగా చూపించి తమ సంఘాలకి రాయలు పేరు ఉపయోగించడం నిజంగానే దిగ్భ్రాంతికి గురి చేసే విషయమే..
ఇక్కడ నా అనుభవంలో ఒక విషయం చెప్తాను. పశ్చిమ గోదావరికి చెందిన ఒక 70 యేళ్ళ కాపు అతను నాకు తటస్థపడి కబుర్లు చెప్పుకోవడం జరిగింది. మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు వాళ్ళ ఊరులో ఉన్నారని ఆయన మా వాళ్ళ గురించి మంచిగా చెప్పడంతో సంభాషణ మొదలయింది. అలా ఆయన కులం గురించి వచ్చింది. కుటుంబం గురించి వచ్చింది. వాళ్ళ కుటుంబంలో ఎవరో తూర్పు కాపులతో పెళ్ళి సంభంధం కుదిరిందంట! దానికి ఆయన బాధ పడ్డాడు. అసలైన కాపులు తూర్పు కాపులతో సంభంధం పెట్టుకోరని, అలానే తెలగలు,బలిజలతో కూడా సంభంధం పెట్టుకోరని. ఇప్పుడు అక్కడక్కడా చేసేసుకుంటున్నారని, బాధగా చెప్పాడు ఆ పెద్ద మనిషి.. అంటే యాభై ఏళ్ళ క్రితం అసలు లేనివి, ఇరవై యేళ్ళ క్రితం మొదలైనవి, ఇప్పటికీ అక్కడక్కడే జరుగుతున్నా కూడా తూర్పు కాపులు, కాపులు,తెలగలు,బలిజలు,ఒంటరిలు మేమంతా ఒకే కులం అని రాజకీయావసరాల కోసం ప్రకటించుకోవడం కూడా నాకు దిగ్భ్రాంతి కలిగించే విషయమే! కొన్నాళ్ళు పోతే తూర్పు కాపులు, ఇంకా బి సి ల్లో ఉన్న మిగిలిన కులాలు ( కాపు శాఖలుగా చెప్పబడుతున్న) కూడా రాయలు మావాడే అని చెప్పుకోవచ్చు...
ఓర్నాయనో, కులాల గురించి ఇంకా ఇంత డిస్కషన్ నడుస్తోందా?
నేను తెలంగాణా లో పుట్టి పెరిగా కాని నేను ప్రత్యేక తెలంగాణా వ్యతిరేక వాదిని.. కెసిఆర్..హు:( ఆయన్ను ఇగ్నోర్ చేయడం ఉత్తమం.
మీ బ్లాగును నా IE8 లో తెరిచినప్పుడల్లా బ్రౌజర్ క్రాష్ అవుతుంది.
నేను వాడుతున్నది కూడా IEనే. అయినా ఏ సమస్యా రాలేదు. మఱి మీకెందుకు వస్తోందో ! అంటే వేఱే బ్రౌజర్లలో బాగానే ఉందంటారా ? బ్లాగు తెఱుచుకోవడానికి అడ్డుపడతాయనుకున్న అన్ని విడ్జెట్లూ, లంకెలూ తీసేశాను. అలా తీసేశాక చక్కగా తెఱుచుకుంటోందని ప్రవీణ్ గార్లపాటి, బ్లాగేశ్వరుడు వంటి మిత్రులు తెలియజేశారు కూడాను !
చంద్ర శేఖర్ రావు కి ఉన్న అనేకానేక టాలెంట్లలో ఇదొకటన్నమాట. అయినా మనం ఇప్పుడు నెహ్రూని తీసుకురాలేంగా, అదీ ధైర్యం! నిజంగానే వాళ్ళేది చెప్తే అది నమ్మేస్తామని ఎలా అనుకుంటారో అంతుపట్టదు. ఆయన మాటల్ని (ముఖ్యం గా వారు విసిరే ఇలాంటి జ్ఞాన గుళికల్ని)పట్టించుకోవడం మానెయ్యాలంతే!
హిందూ లోని వ్యాసం గురించి ఒక మిత్రురాలు (నేను హిందూ తెప్పించను) చెపితే విని మూర్చ పోయాను.సాక్షాత్తూ వివేకానందుడి మీద ఇలాంటి బురద చల్లారంటే ఇలాంటి వాటికి అతీతమైనది ఏది?
"పుకార్ల మీదపడి బతుకుదామనుకునేవారు వీరు. వీరికి మన మేధాశక్తి మీద చాలా చిన్నచూపు. మనకేమీ తెలియదనీ, తాము ఏది చెబితే అదల్లా మనం నమ్మేస్తామనీ, సొంతబుద్ధితో ఆలోచించలేమనీ వీళ్ళు అనుకుంటున్నారు. "
నిజ్జెంగా నిజం!
వివేకానందులు ఒకసారి వారి శిష్యులకు రాసిన ఒక ఉత్తరంలో అంటారు "America is crazy! whatever you do and preach, irrespective of logic, value, and the strength of the idea.. everything has mileage here. Every random theory/philosophy/talk has followers. People seek sensation" (not an exact quote)
మనదేశంలోని మతిలేని మేధావి వర్గానికి దీన్ని ఆపాదించడం ఎంతవరకు సమంజసమో గానీ, మీరన్నట్లు మన "మేధావులకు" వినే వారి విజ్ఞత మీద చాలా చిన్నచూపు ఉంది. People think that they can write whatever they want, and get away with it. And there is more to it, surprisingly enough, these retards have followers too!!
ఏం చేస్తాం! ఖండిస్తాం!!
"Brothers and Sisters of America" అని ప్రసంగం మొదలుపెట్టిన వివేకానందుడి మీదే ఈ రకమైన రాతలా? సిగ్గు చేటు. KCR రాజాకీయాలలో Einstein లాంటి వాడు. TRS పెట్టిన తర్వాత చాలా కొత్త విషయాలు కనుక్కొన్నాడు.
బాటసారి @
మిగతా కులాల వాళ్ల గురించి కామెంట్ చేస్తున్నారుగా
బాటసారి కులమేంటో చెబితే బాగుంటుంది.
సతీష్గారూ
వ్యక్తిగతాలొద్దు. సబ్జెక్టు మీదే మాట్లాడుకుందాం.
వ్యక్తిగతంకన్నా ఈరోజుల్లో మతం, కులాన్నే చాలా సీరియస్స్గా తీసుకుంటున్నారు చాలామంది. మీరు చెప్పిన విషయంతో ఏకీభవిస్తున్నా. కానీ బాటసారి కామెంట్స్ అభ్యంతకరంగా ఉన్నాయి. ఒకళ్లని తక్కువ చేసి మాట్లాడడం చాలా తేలిక.
@సతీష్
నేను ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడానో చెప్పండి... నేను ఆ కులానికి చెందిన వయసైపోయిన ఒక పెద్ద మనిషి మాటల ఆధారంగా చెప్పాను, ఆయన మాటలని నా చుట్టూ ఉన్న వాటితో పోల్చుకుంటే నిజమే అనిపిస్తుంది. మీకింకా ఈ టపాలో లేవనెత్తిన విషయాల గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. ఎందుకలా జరుగుతుందో చర్చించండి. నేను మిగతా అన్ని కులాల గురించి కామెంట్ చెయ్యలేదు.ఈ టపాలో ప్రస్తావించిన కులం(ఇప్పుడు అంతా ఒక్కటిగా చిత్రీకరించబడుతున్న మిగిలిన కులాల గురించి) గురించి నాకు తెలిసింది చెప్పాను. నీకులమేంటి, నా కులమేంటి అనేది ప్రశ్న కాదు. నా కులాన్ని బట్టి నిజాలు మారిపోవు. ఇక్కడ వ్యక్తిగతాల మీద శ్రద్ధ పెడితే విషయ ప్రాధాన్యత తగ్గి, అదో గందరగోళానికి దారి తీస్తుంది.చర్చలు ఎలా జరుగుతాయో, ఎలా విఫలమవుతాయో తెలిసిన వాడిగా మీరు విషయం మీద చర్చించడానికి ఆసక్తి చూపించకుండా, నా కులాన్ని బట్టి నేను రాసిన దానిని పరిశీలించకుండా నిజా నిజాలు ఖరారు చేసేట్టు అనిపిస్తుంది. అది చర్చా స్పూర్తి కి విరుద్ధం...
అవసరమైతే తప్ప మతం, కులం ప్రస్తావన తీసుకురాకపోవడమే ఉత్తమం.
ఈ వ్యాసంలో పై విషయాన్ని ఉదాహరణగా వాడాల్సిన అవసరంలేదు.
ఎవరో చెప్పిన విషయాన్ని మీరు ప్రస్తావించారు. కాని చివర్లో మీ అభిప్రాయాల్ని రాశారు. అది నాకు నెగటివ్గా అనిపించింది. మీకది పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. అన్నది వేరే వాళ్లని కాబట్టి.
నా వాఖ్యలు కూడా మీకు దిగ్భ్రాంతి కలిగించి ఉండవచ్చు. క్షమించండి.
మన అభిప్రాయాలు కాదు. చరిత్ర ఏం చెబుతోందనేది ముఖ్యం. ఆ చరిత్రకి మూలమైన మూలపురుషులు తమ గ్రంథాల్లో ఏమని రాసుకున్నారనేది ముఖ్యం. అదే విధంగా కులస్వార్థాలతో మతస్వార్థాలతో ఇంకా ఏవేవో ఇతరేతర స్వార్థాలతో తప్పుడు ప్రచారాలకి దిగేవాళ్ళు ఎందుకలా దిగుతున్నారో అవి ఏ విధంగా తప్పుడు ప్రచారాలో బయట పెట్టాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది - ఎవరు ఎంతగా ఏడ్చుకున్నా సరే ! కాపునాడు ఉదాహరణ పనికిరాదట. భేష్ ! అంటే ఆయా కులసంఘాలు ఏ చెత్త మాట్లాడితే ఆ చెత్తకల్లా జనం నోరు మూసుకొని తలూపాలా ? ఏంటి మాకంత ఇంట్రస్టు ?
సతీష్ గారూ ! పోనీ ఏం రాయాలో మీరు చెప్పండి, ఇకనుంచి అదే రాస్తాం. మా సొంత బుఱ్ఱలెందుకు ?
నీ మిత్రులెవరో చెప్పు నువ్వేంటో చెపుతా అన్నది లోక నానుడి.దిన్నడ్డం పెట్టుకుని రేపు TRS నేత రేపు ఆ కాముకుడు మీ స్నేహితుడవడం చేత మీరు కూడా పెద్ద కామకుడని చేతికి మల్లెపూలు చుట్టుకుని తెల్ల లాల్చీ పైజమా తోనే దర్శనం ఇస్తుంటారని అంటాడేమో నండి ఖర్మ.
మఱొక విషయం. కాపునాడు నాయకులు తమ కుల సంక్షేమానికి పరిమితమైతే వాళ్ళ మీద ఈ విమర్శ వచ్చేది కాదు. అలా చెయ్యకుండా యావత్ జాతికి చెందిన మహాపురుషుల్ని కులపరంగా కిడ్నాప్ చేసి పబ్బం గడుపుకోవాలని ఎప్పుడైతే చూశారో అప్పుడే వాళ్ళు ఒక చారిత్రిక విషయాన్ని పబ్లిక్లో చర్చకి పెట్టినట్లయింది. ఒక విషయం ఒకసారి పబ్లిక్లోకి వచ్చాక దాని మీద మాట్లాడే హక్కు అందఱికీ వస్తుంది. ఒక టాపిక్ మీద ఒకసారి జనం మాట్లాడ్డం మొదలుపెడితే వాళ్ళ నోళ్ళు మూయడానికి మూకుడేది ? అప్పుడది ఒక కులానికి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం ఎలా అవుతుంది ? కాపునాడు నాయకులు ఈ విషయాలన్నీ ముందే ఆలోచించుకొని ఉండాల్సింది. తమ తప్పేంటో తెలుసుకోకుండా "అదిగో మమ్మల్ని విమర్శించేస్తున్నారు" అని బాధపడ్డం అవివేకం. విమర్శకి గుఱయ్యేంత హాస్యాస్పద స్టేట్మెంట్లు చెయ్యకుండా జాగ్రత్తపడితే ఈ బాధ తప్పేది కదా !
రవిగారూ ! మన వ్యక్తిగతాలెందుకులెండి ? సబ్జెక్టులోకి వద్దాం. అయినా You can not choose your childhood friends.
తెలుగు మాట్లాడే కాపుకులం ఆంధ్రదేశపు తూర్పుతీరంలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా లేదు -- దీనికి ఆదార మేమిటి ??
తమిల్ నాడు , కర్ణాటక , రాయలసీమలలో విస్తారంగా ఉన్నారు ..
@తాడేపల్లీ
నేను మీరు చెప్పిన నిజాల మీద విమర్శ చేయలేదు. రాయలు మావాడు అనుకునేవాళ్లు నాకు తెలిసి చాలా తక్కువ. అధికారికంగా చరిత్రను ఎవరైనా మార్చేశారా?
పబ్లిక్కులోకి వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటే మీ ఇష్టం.
నిజం మాట్లాడండి. అనవసమైన కామెంట్లు ఎందుకని. బాటసారి చేసిన కామెంట్లకే నేను ఫీలవుత.
హాస్యాస్పద స్టేట్మెంట్లు ఇచ్చిన మతంలోనే పుట్టాను. కులం ఒక లెక్కా?
అయినా మీరు అనవసరంగా రాశారని నేను అనవసరంగా కామెంట్ చేయడం తప్పే. దయచేసి నా కామెంట్లు తొలగించండి.
@ సతీష్ గారు
నేను మాట్లాడినవి నిజాలే.కాదని ఎలా చెప్పగలరు? నిజాలు కాని విషయాలు మాట్లాడి సమయం వృధా చేసుకోలేను. మీకు ఆమోదయోగ్యం కాకపోతే నేనేమీ చెయ్యలేను.ఒక సారి మన తాతల తరం వారితో ( సామాజికంగా చైతన్యంతో ఉన్న) ఎవరితోనైనా మాట్లాడి బేరీజు వేసుకోండి.
@ శివ
అదే ప్రశ్న మీకు కూడా వేస్తున్నాను. కర్ణాటక, తమిళ నాడు, రాయల సీమల్లో ఉండేది బలిజలు.కొంత కాలం క్రితం వరకు బలిజలతో తెలగలకి, కాపులకి సామాజికంగా సంభంధాలు ఉండేవి కాదు. 1921 జనాభా లెక్కల ప్రకారం కూడా ఈ మూడు కులాలు వేరుగా పరిగణించబడ్డాయి. ఇప్పటికీ కాపు కులంగా గుర్తించబడే వారు ఓసి లు, తూర్పు, పశ్చిమ గోదావరిల్లోనే ఎక్కువమంది ఉంటారు. మిగిలిన ప్రాంతాల్లో ఉన్నా వారు ఇక్కడి నుండి వలస వెళ్ళినవారే...
@బాటసారి
వదిలెయ్యండి
బెంచ్లో ఉండటం వల్ల వచ్చిన సమస్య. ఊసుపోక అనవసరంగా కెలికాను.
మన బంగారం మంచిది కాకపొతే ఏమి చెయ్యగలం?
వేరే వాళ్లను విమర్శించడంకన్నా మన లోపాలు సరిదిద్దుకోవటమే మేలు
మళ్లీ మీ జోలికి రాను.
@బాటసారి
"కొన్నాళ్ళు పోతే తూర్పు కాపులు, ఇంకా బి సి ల్లో ఉన్న మిగిలిన కులాలు ( కాపు శాఖలుగా చెప్పబడుతున్న) కూడా రాయలు మావాడే అని చెప్పుకోవచ్చు..."
చివరగా మీరన్న కామెంట్కే నేను స్పందించింది. అది నిజం కాదు. మీ అభిప్రాయం మాత్రమే. ఆ ఒక్క మాట మొత్తం అర్ధాన్ని మార్చింది.
నా అభ్యంతరం కొంతమందికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కాని నా దృష్టిలో అనవసరమయిన వ్యాఖ్య.
నేనివ్వాలనుకున్న సమాధానం బాటసారిగారు ఇచ్చేశారు.
ఇక్కణ్ణుంచి వలసవెళ్ళినవాళ్ళ గుఱించి కాదు రాసింది. అసలు కాపుకులానికి మాతృభూమి ఎక్కడ ? అది ఆలోచించండి. ఈ వలసదార్లు కూడా ఈమధ్యకాలంలో ఉద్యోగరీత్యా వలసపోయినట్లు కనిపిస్తోంది. తరతరాలుగా ఆయా రాష్ట్రాల్లోనే ఉంటున్నామని చెప్పుకుంటున్న కాపులెవరు ? నాకు తెలిసి ఈ కాపు అనే కులంపేరు ఆయా రాష్ట్రాల్లో ఎవరికీ తెలియదు. కృష్ణదేవరాయలకీ కాపులకీ ఉన్న సంబంధం ఏంటో నిరూపించకుండా ఇంకేదో నిరూపించమని నన్ను ఎదురుప్రశ్న వెయ్యడం ఆశ్చర్యంగా ఉంది.
@ సతీష్ గారు
జరుగుతున్న పరిణామాల బట్టి అది నేను అంచనా వేసింది మాత్రమే. దాన్ని చూసి దయచేసి ఇబ్బంది పడకండి. ఒకవేళ అది మిమ్మల్ని బాధిస్తే క్షమించండి.తూర్పు కాపులందరు ఇంకా కాపులతో కలవలేదు. కొంత మంది మాత్రమే కలిసారు.తూర్పు కాపులు వారి వారి చారిత్రక,సామాజికపరమైనటు విషయలని ఇంకా మరిచిపోలేదు, వారి ఉనికిని వారు రాజకీయంగా సామాజికంగా చాటుకుంటున్నారు కూడా. కానీ ఈమధ్య కొంతమంది లో మొదలయిన ఆ పరిణామం అందరికీ విస్తరిస్తే కొంతకాలానికి అలా జరిగినా జరగొచ్చు అని నా అంచనా అంతే.మీరు మొత్తంగా సామాజికంగా, రాజకీయంగా కాపులు(OC) జరుపుతున్న ప్రయత్నాలని గమనిస్తే ఒక అవగాహనకి రాగలరు...
తాడేపల్లి
చరిత్రను గుడ్డిగా నమ్మను నేను. అదీ భారత దేశ చరిత్రను.
తెలుగు వాళ్లు ఎలా ఫార్మ్ అయ్యారో అందులో కులాలు ఎలా పుట్టాయో ఎవరికి తెలుసు పూర్తిగా?. మచ్చ లేని, సంకరం కాని ప్యూర్ కులం, జాతి ఉందా ఎక్కడయినా?
నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా, మీ నిజాల్ని నేను ప్రశ్నించలేదు.
కుల సంఘాల వాళ్లు ఎవడో చరిత్రకారుడి పుస్తకం చదివి అలా క్లెయిం చేసుకున్నారు. స్టిల్.. చాలా మంది ఆయన్ని మావాడు అని అనుకోరు, తెలియదు కూడా. మీ రాజు గారి గురించి ఫీల్ అవ్వొద్దు. అలా నమ్ముతున్న వాళ్లందరికీ చెబుతా అది సరి కాదని.
బాటసారి
సెన్సిటివ్ విషయాల మీద అనవసరంగా వ్యాఖ్యలు చెయ్యడం ఇష్టం లేకే మీకు సమాధానం చెప్పటంలేదు.
@ సతీష్ గారు
పై వ్యాఖ్యలో మీరు చెప్పినవి ఈ టపాలోని అంశానికి అతీతమైనవి. దాని ఆధారంగా ఈ చర్చ అనవసరం అనుకుంటే అది మీ ఇష్టం.సున్నితమైన అంశం అని చర్చకి దూరమైన ప్రతీ సారీ మన తరపున నిర్ణయాలు వేరొకరు తీసుకుంటారు.చివరకి అవే అమలవుతాయి.తరవాత అదే చరిత్ర అవుతుంది... నిజానికి ఏదీ సున్నితం కాదు, వివాదాస్పదం కాదు మనం ఆ అంశాన్ని ఆవిధంగా చూడనంత వరకూ... మన దృక్పధం మాత్రమే ఒక అంశానికి సున్నితత్వం/వివాదాస్పదమైన ముద్రని వేస్తుంది...
బాటసారి గారూ రెడ్డి కులంలో కూడా చాలా శాఖలు ఉన్నాయి . కోస్తాంద్రా రెడ్లు రాయలసీమ వారితో గాని , తెలంగాణా రెడ్లతో గానీ వియ్యమందుకోరు . అయినా రెడ్డి కులస్తులందరూ ఒక్కటే కదా.
ఇక కాపు కులం యొక్క శాఖలు గురుంచి ఈ వికీపీడియా లింక్ చూడండి .
http://en.wikipedia.org/wiki/Kapu_(caste)
@శివా
వేరే వాళ్లని ఇందులోకి లాగొద్దండి.
@తాడేపల్లి
కాపుల పుట్టుక గురించి అడుగుతున్నారు. తెలుగు వాళ్లు ఎక్కడి వాళ్లో, ఎప్పుడు భూమ్మీద ఊడిపడ్డారో స్పష్టమయిన ఆధారాలు లేవు. ఇక కులాల గురించి ఏంచెప్పగలం?
మీకు కోపం తెప్పించిన విషయంపై విమర్శ చేసేటప్పుదు కూలంకషంగా రాయొచ్చు కదా? ఏవడో ఒక విదేశీ చరిత్రకారుడు రాయల వంశస్తులు బలిజలు అని రాసాడంట. అది చూసి కుల సంఘాల వాళ్లు తమకి తగిలించేసుకున్నారు. ఎందుకు ఈడెంటిటీ కోసం. చరిత్రను మార్చేస్తున్నారని మీకు బాధ కలిగింది. అది తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలున్నప్పుడు వాటి గురుంచి అందరికీ వివరించండి అందరూ అర్ధం చేసుకునే రీతిలో. వికూపీడీయాలో కుడా ఇదొ వివదాస్పద విషయం అని రాశారు. మన చరిత్ర పుస్తకాల్లో ఈ విషయం రాలేదు కదా? అసలు రస్సెల్ అనే వ్యక్తి ఎందుకు, ఏ అధారం చూసి రాశాడో చెబితే బాగుంటుంది కదా? మీ వెర్షనే నిజం అయినప్పుడు అవతలివాడిది ఎందుకు తప్పో చెప్పండి.
అసలు ఈ భూమి ఎలా పుట్టిందో, మనిషి ఎలా పుట్టాడో చెప్పగలరా ఎవరైనా అధారాలతో? ప్రతీ మతమూ తమ వెర్షనే నిజమని క్లెయిం చేసుకుంటూ కోడి గుడ్డు మీద ఈకలు పీకటంలేదా?
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.