కారణాలేవైనా కావచ్చు.గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఒక ధనికరాష్ట్రంగా మారింది.పేదవాళ్ళు మధ్యతరగతిగా, మధ్యతరగతివాళ్ళు ధనికులుగా, ధనికులు కుబేరులుగా అవతరించారు.జిల్లాలవారీగా వ్యత్యాసాలుండొచ్చు.కాని మొత్తం మీద రాష్ట్రం ఇదివరకటిలా లేదు.గుమాస్తాలు ఉపాధ్యాయులతో సహా ప్రతికుటుంబానికీ ఒక సొంతయిల్లు సొంతకారులాంటివి మామూలైపోయాయి.ఈ ఆర్థిక ఉల్బణం(economic_boom)తెలుగు నగరాల్లో స్పష్టంగా కనిపిస్తూండగా మిగతా ప్రాంతాలు కూడా క్రమంగా ఆ బాటలోనే నడుస్తున్నాయి.ఈ బుడగని ఇలాగే పేలిపోకుండా ఎంతకాలం పాటు నిభాయించగలమో తెలియదు.
దీపం కింది చీకటిలాగా ఇక్కడ ఈ నడమంత్రపు సిరితో పాటే సమాంతరంగా కటిక పేదఱికం కూడా ఉంది.నిర్లక్ష్యానికి గురైన పేదఱికం.ఈ సరికొత్త విపణివ్యవస్థ(market_economy)కి దీటైన నైపుణ్యాలు లేకపోవడంవల్ల మిగిలిపోయిన పేదఱికం.దానికీ సంపదకీ మధ్య అంతరం భారీగా ఉంది.అది ఇంకా పేదలుగానే మిగిలిపోయినవారిలో తీవ్రమైన ఆవేదనకీ హతాశకీ అసూయకీ దారితీస్తోంది.తమ కళ్ళముందే తమ సాటి(వృత్తిపని)వాళ్ళు ప్రతిదానికీ రు.500 నోట్లు బయటికి తీసే స్థాయికి ఎదిగిపోవడం తాము మటుకు ఇంకా ఱెక్కాడితే గాని డొక్కాడని, ఱెక్కాడినా నికరంగా రు.100 కూడా గిట్టుబాటు కానటువంటి అనిశ్చితిలో కొట్టుమిట్టాడాల్సి రావడం వారికి ఎంతమాత్రం మింగుడుపడ్డంలేదు.
తత్ఫలితంగా గతకొద్దికాలంనుంచి ఇక్కడ పిల్లల అపహరణలూ ఇళ్ళల్లోనే హత్యలూ పెరిగిపోతూ రావడాన్ని గమనిస్తున్నాను.ఈ ఆర్థికనేరాలకు పాల్పడ్డవాళ్ళెవరికి అంతకుముందు నేరచరిత్ర లేదు.పైపెచ్చు నేరస్థులు హతులకు ఏదోవిధంగా మిక్కిలి సన్నిహితులు కూడా.వాళ్ళెవరూ నేరాల్లో కరుడుగట్టిన వృత్తినిపుణులు కారు.వాళ్ళంతా ఎక్కువ సందర్భాల్లో జీవితానుభవం అంతగా లేని యువజనం.వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉండడం ఆందోళనకరం.నిరుడు తెలుగుదేశంపార్టీకి చెందిన ఒక మాజీ మహిళా శాసనసభ్యురాల్ని పనిమనిషే డబ్బు కోసం కిరాతకంగా చంపేసింది.ఒక వ్యక్తి దగ్గర ఏదో ఒక సందర్భంలో ఒక కట్ట నోట్లు కంటపడ్డం, దాని ఆధారంగా అతని దగ్గర కట్టలు కట్టలుగా డబ్బు ఉందనే అపోహతో దాన్ని దోచుకుందామనీ దానితో తమ జీవితమే మారిపోతుందనే దురాశతో చేసినవి సదరు నేరాలు.ఈ మధ్య చాలామంది పిల్లలూ పెద్దవాళ్ళూ కూడా ఈ హత్యలకు బలైపోయారు.
తమ దగ్గర డబ్బు, ఆస్తి ఉన్నాయని గాని, తాము ఫలానా సంస్థలో ఫలానా హోదాలో ఉంటున్నామని గాని పొక్కితే భద్రత లేని రోజులివి.పనివాళ్ళముందు డబ్బు బయటికి తియ్యడం ప్రాణాంతకమని ఋజువైన కాలమిది.తామో తమవాళ్ళో ప్రవాస భారతీయులని చెప్పుకోవడం కూడా ముప్పే.తమ కంటే ముందు తమ పిల్లలకే ప్రమాదం.
చట్టపరమైన చర్యలతో ఈ సమస్య సమసిపోతుందా ? ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమా ? సామాజిక భద్రత లేని సమాజంలో శాంతిభద్రతల నిర్వహణ కృత్రిమమే అవుతుందా ?
ఆలోచించాల్సి ఉంది.
