
మన శాసనపాఠాల్ని జాగ్రత్తగా చదివితే వాటిల్లో ఎక్కడో ఒక మూల తప్పనిసరిగా ఇలాంటి గద్య (paragraph) ఒకటి దర్శనమిస్తుంది.
"Notwithstanding anything contained in the afore-mentioned clauses..." (పైన పేర్కొన్న అధికరణములలో చెప్పబడినదేమైనప్పటికిన్ని...)
ఇవి తప్పులు చేసేవాళ్ళ సౌలభ్యార్థం ఉద్దేశపూర్వకంగా చొప్పించిన సేఫ్టీవాల్వులేమోనని మనం అనుమానించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అవి అవే ! మన చట్టాలన్నీ(రాజ్యాంగంతో సహా) ఇలాంటి రహస్యమార్గాలతోను, కొన్ని వర్గాల కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన Emergency Exit లతోను నిండిపోయాయి. ఈ మినహాయింపులు మన ఉమ్మడి న్యాయబుద్ధి (collective sense of justice) నీ సమానత్వ సూత్రాన్నీ పరిహాస భాజనంగా మార్చాయి. నిజానికి ఈ దేశంలో సమైక్యమూ, సమానత్వమూ, న్యాయమూ అనేవి ఎవరికీ అవసరం లేదు. తన కులమూ, అందులో భాగంగా తానూ బావుంటే చాలు. అదే సమైక్యం. తన కులానికి కొన్ని చట్టబద్ధమైన ప్రత్యేకింపులు (reservations) ఉంటే చాలు. అదే సమానత్వం. అదే న్యాయం. ఈ సంకుచితత్వానికి సామాజిక న్యాయం అని పేరు కూడా పెట్టారు. న్యాయమంటూ ఉంటే అది ఇలా మనిషికో రకంగా, కులానికో రకంగా ఉండదు. కుటుంబన్యాయం, సామాజిక న్యాయం రాజకీయన్యాయం, మతన్యాయం అంటూ ఇన్ని రకాల న్యాయాలు లేవు. ఒకవేళ ఉంటే అది న్యాయమే కాదు. కాని ఈ విషయం ఈరోజు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. ప్రపంచచరిత్రలో ఇప్పటి దాకా జఱిగిందేమిటంటే - ఒకఱి కోసం ఉద్దేశించిన సౌలభ్యాల్ని ఇంకొకఱు వాడుకోవడం."చీమలు పెట్టిన పుట్టలు పాముల కిఱవైన యట్లు". మన మీటకాలు (keyboards) నిజానికి గ్రుడ్డివారి కోసం ఉద్దేశించినవి. కాని వాటిని వాడేవాళ్ళంతా కళ్ళున్నవాళ్ళే. అలాగే సంసార బాధితుల కోసమూ విధుర వితంతువుల కోసమూ ఏర్పఱచిన విడాకుల్నీ, మాఱుమనువు వెసులుబాటునీ చాలావరకూ ఆ బాధలేమీ లేనివాళ్ళే ఎడాపెడా వాడేసుకోవడాన్ని మనం గమనిస్తున్నాం.
అలాగే వ్యవసాయరంగంలో బడుగుల కోసం ఉద్దేశించిన ఆదాయంపన్ను మినహాయింపుని కూడా పిడుగుల్లాంటివాళ్ళే వాడుకోవడం జఱిగింది. అలా వాడుకోబడుతుందని ఆ మినహాయింపు ఇచ్చినవాళ్ళకు తెలియదా ? అంటే, ఎందుకు తెలియదు ? భేషుగ్గా తెలుసు. స్వప్రయోజనాల రీత్యా చాలా దూరదృష్టితో చేసిన పని ఇది. ఇందులో ఉన్న కరటక నీతి ఇది-
1. మనం (మినహాయింపు ఇచ్చిన పెద్దమనుషులు) సమీప భవిష్యత్తులో ఆర్థిక అద్భుతాలేమీ సాధించబోవడం లేదు. కాని ఈ లోగా మనకు వోట్లూ సీట్లూ కావాలి.
2. ఆ వోట్లూ, సీట్లూ మనకే శాశ్వతంగా దఖలైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోను రెండోవాడికి అవకాశం ఉండకూడదు. అంటే మనకొక శాశ్వత వోట్బ్యాంక్ ఏర్పడాలి. అందఱికీ మేలు చేస్తామంటే అది ఏర్పడదు. కమ్యూనిస్టులు ఏదైతే చేస్తామంటున్నారో అది మనమే చేసేసి అధికారంలో సుస్థిరంగా పాతుకుపోవాలి.
3. మెజారిటీ అంటే అధిక జనాభా. మన జనాభాలో ఎక్కువమంది రైతులు. మనమూ రైతులమే. కాబట్టి వారికి పనికొచ్చేదేమైనా చేస్తే చాలు. మిగతా దేశమంతా ఏ దిబ్బలో కొట్టుకుపోయినా ఫర్వాలేదు.
4. రైతు సమస్యల మీద గతంలో బ్రిటీషువారి మీద ఉద్యమించి అప్పటి ప్రొవిన్షియల్ ప్రభుత్వాల్లో స్థానం సంపాదించాం.ఆ సమస్యల్లో ముఖ్యమైనది పంటల మీద అధిక పన్ను.కాబట్టి ఇప్పుడు కూడా అదే మంత్రం పఠిద్దాం.
5. పన్ను తగ్గిద్దామా ? వద్దు. అలా చేస్తే మనకంటే ఇంకా తగ్గిస్తామనేవాళ్ళు మనకు పోటీవస్తారు. అసలు ఏకమొత్తంగా పన్నే ఎత్తేద్దాం. అప్పుడు రైతాంగంలో మన ప్రభంజనానికి తిరుగుండదు.
6. పనిలో పనిగా మనకూ పన్నుండదు. మన నల్లడబ్బంతా రాజమార్గంలో తెల్లబఱచుకోవడానికి ఇది లెస్సగా ఉపకరిస్తుంది. తద్ద్వారా మనకు ఎన్నికల్లో తోడ్పడే జమీందార్లూ, భూస్వాములూ కూడా మనకే శాశ్వతంగా జై కొడతారు.
ఈ రకంగా వ్యవసాయం మీద పన్ను లేకపోవడం అనే ఆర్థిక రుగ్మత స్వాతంత్ర్యానంతరం వచ్చిపడ్డదే తప్ప భారతదేశ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలుగా వ్యవసాయం మీద పన్ను ఉంటూనే వచ్చింది. రాజులు బలి-షడ్భాగమనే పేరుతో పంటలో ఆఱో వంతుని రైతుల నుంచి వసూలు చేసేవారు. బ్రిటీషువారి పాలనలో ఆ పన్ను శాతం అమానుషమైన స్థాయి (40-60 శాతం) కి పెఱిగిపోవడాన్ని కాంగ్రెస్పార్టీ స్వాతంత్ర్య పోరాటకాలంలోను, ఆ తరువాతా కూడా పైన చెప్పిన విధంగా తన కనుకూలంగా మలచుకుంది.
కాని వ్యవసాయం మీద ఎంతో కొంత పన్నువెయ్యకుండా మనం గ్రామాల్ని అభివృద్ధి చెయ్యలేము. కాబట్టి గ్రామీణ యువకులు ఉగ్రవాదులు కాకుండా నిరోధించనూ లేము. రైతులక్కూడా ఏ సహాయమూ చెయ్యలేము. ప్రీమియమ్ చెల్లించకుండా బీమా ప్రయోజనాన్ని అందించగలమా ? ఇప్పుడు రైతుల పేరు చెబితేనే బ్యాంకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి - వసూలు కాని వేలాదికోట్ల అప్పులు గుర్తొచ్చి. దానికి తోడు శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తూండడంతో శేఖర్దాదా రైతుల అప్పులు మాఫీచెయ్యాలంటూ పాతపల్లవి ఎత్తుకున్నాడు. ఎంతకాలమిలా అప్పులు మాఫీ చేస్తారు ? ఎంతకాలమిలా రైతుల్ని దేశానికి గుదిబండలుగా మారుస్తారు ? ఎంతకాలమిలా రైతుల్ని దేశపు ఆర్థిక వనర్ల పాలిట దోపిడీదార్లుగా రూపొందిస్తారు ?
వ్యావసాయిక ఆదాయం మీద పన్ను సరికొత్త ప్రతిపాదన కాదు. గతంలో బలరామ్ జాఖడ్ అనే లోక్సభ స్పీకరు ఈ విషయమై పదే పదే ప్రస్తావించి స్పందన లేకపోవడంతో ఊరుకున్నాడు. మన నాయకుల స్వార్థమూ, రైతుల అజ్ఞానమూ పట్టణ ప్రజల ఉదాసీనత్వమూ, ఆర్థికవేత్తల మూర్ఖత్వమూ, ఎఱ్ఱజెండాల ప్రచారమూ - వెఱసి ఈ సంక్షోభానికి కారణం.
ఈ రోజు ఇలాంటి ప్రతిపాదనలు చేసేవాళ్ళు రైతుల పాలిట శత్రువులుగా చూడబడతారు. కాని పట్టణ ప్రజల శాతం పెఱిగే కొద్దీ భూమి విలువ అధికమయ్యే కొద్దీ ప్రభుత్వానికి రాజస్వపు (revenue) అవసరాలు హెచ్చేకొద్దీ దీని అవసరాన్ని తప్పకుండా అందఱూ అర్థం చేసుకుంటారు. అది 20ఏళ్ళకు కావచ్చు. 40ఏళ్ళకూ కావచ్చు. అయితే వినాయకుడి బొడ్డులో తేలుందనీ, అది కుట్టడం మూలానే మనకు నొప్పిగా ఉందనే నగ్నసత్యాన్ని ఎవఱో ఒకఱు బయటపడి వెల్లడించక తప్పదు.
