4.12.07
రైతుల ఆత్మహత్యలు-1
11:13 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: వ్యవసాయం
రైతులకు సంబంధించిన ప్రతి విషయమూ రాజకీయమై పోయిన తెలుగు వాతావరణంలో ఇందులోని విషయాల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ రాయక తప్పదు. నా అభిప్రాయం చెప్పకతప్పదు.
రైతుల ఆత్మహత్యలకెన్నో కారణాలుండవచ్చు.నాకు మాత్రం ప్రముఖంగా కనిపిస్తున్నది చిన్న కమతాలు (small_land-holdings). నా పరిశీలనలో ఆత్మహత్యలకు పాల్పడ్డ వాళ్ళంతా అయిదెకరాల లోపు చెలకల్ని సాగుచేస్తున్నవాళ్ళే. ఇంకా ఎక్కువ ఎకరాలు చేస్తున్న రైతులు కూడా అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుని ఉండొచ్చు. కాదనను.కాని అవి బాగా పొడిభూములై ఉంటాయి. అంటే వాటిల్లో ఏడాదికి ఒక పంట సక్రమంగా దిగడమే గగనం. అలాంటివి ఎన్ని ఎకరాలున్నా ఏమీ ఉపయోగం లేదు.
భూకమతపు విస్తీర్ణానికీ రైతు ఆత్మహత్యకీ ఏమిటి సంబంధం ? అంటే చాలా ఉంది.చిన్న కమతాల్లో సాగు వాణిజ్యపరంగా లాభసాటి కాదు. వాటిని సాగు చేసేవాళ్ళు ఆ పంట నంతా తమ కుటుంబపోషణకే వినియోగించాల్సి వస్తుంది (subsistence_farming). విపణిలో అమ్ముకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ మిగలదు. అయితే ప్రతి సీజన్లోను ఎకరా పెట్టుబడి మాత్రం భారీగానే ఉంటోంది. వేసే పంటని బట్టి అది ఎంత స్థాయికైనా ఎగబ్రాకొచ్చు. వరి మిరప లాంటివాటి మీద ఖర్చు ఎకరాకు పదివేల పైమాటే.అంటే మూడెకరాల ఆసామి ముప్ఫైవేల కంటే ఎక్కువే పెట్టాలన్నమాట. ప్రకృతి వైపరీత్యాల మూలంగా రెండెకరాల్లో పంట హుష్ కాకీ అనుకుందాం. ఇఱవై వేలు గోవిందా ! వాటి మీద ఆదాయమూ గోవిందా ! ఒకసారి కఱువొస్తేనే చిన్నరైతు పరిస్థితి ఇలా ఉంటే నాయుడుగారి హయాంలోలా మూడేళ్ళ వరస కఱువు బాధిస్తే ఏం చెయ్యాలి ? అతను అప్పులపాలు కాకుండా ఎలా ఉంటాడు ? వాటిని ఎలా తీఱుస్తాడు ? వానలు మొహం చాటేశాయని బోర్లు తవ్విస్తే మళ్ళీ 30 వేల నుంచి లక్ష దాకా అప్పు సిద్ధం.
పూర్తిగా ప్రభుత్వాన్నో ప్రకృతినో నిందించడం సమంజసమేనా ? అసలిన్ని చిన్న కమతాలు ఎందుకు తయారయ్యాయి ? ఇంతమంది స్తోమత లేని రైతులు మనలో ఎందుకు తయారయ్యారు ? మనలో 65 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండడం గర్వకారణమా ? గర్హణీయమా ?
ఇందులో అందఱి బాధ్యతా ఉంది. "ఉన్నవాళ్ళ దగ్గఱ భూములు లాక్కుని లేనివాళ్ళకు పంచడమే సోషలిజం, అదే పురోగతి" అనుకున్న 1960-70 ల నాటి ప్రభుత్వ విధానాల్లోను భూసంస్కరణల్లోను ఉంది అసలు కిటుకు .పండినప్పుడు తినీ తాగీ పండకపోతే ఎండిపోయే రైతుకుటుంబాల ముందుచూపులేమిలో ఉంది. మధ్యతరగతి రైతులు చనిపోతే వాళ్ళ భూముల్ని ఎకరం, రెండెకరాలు, మూడెకరాలుగా విడగొట్టుకుని నష్ట నిభాయింపు శక్తి (risk-bearing ability) లేకుండా సాగులోకి దిగిన, వారి వారసుల్లో ఉంది అసలు కారణం. మన సమస్యలకు పరిష్కారాలు మన దేశచరిత్ర మనకు నేర్పిన అనుభవంలోంచే పుట్టాలి. పరాయి దేశాల అనుభవం, వారి పరిష్కారాలూ ఎప్పటికీ మనవి కాదు.
మన దేశం వ్యావసాయికదేశం ఎందుకయింది ? అంటే సుసంపన్నమైన భారత దేశపు ఉష్ణమండల ప్రకృతిసంపద ఇక్కడి మనుషుల్ని జడభరతులుగా, సోమరిపోతులుగా మార్చడం వల్ల అనుకుంటా. భారతీయ రాష్ట్రాలు ఒకప్పుడు భూతలస్వర్గాలు. ఈరోజు అధికజనాభా నరకాలు. .ఒకనాటి ప్రకృతిసంపద ఇచ్చిన అతి-ఆత్మవిశ్వాసం ఈనాటి ఈ పరిస్థితికి కారణం. "ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదు విశాఖపట్నం మాత్రమే" అనుకుంటూ వస్తున్న రాష్ట్రప్రభుత్వం ఆయా జిల్లాల, రంగాల అభివృద్ధిని గాలికొదిలేసింది, దశాబ్దాలుగా ! ఇక్కడ పరిశ్రమలు గానీ సేవారంగం గానీ చెందాల్సినంత అభివృద్ధి చెందని నేపథ్యంలో జనమంతా వ్యవసాయం మీదపడ్డారు. ఏ చదువూ సంధ్యా లేకుండా "మా అయ్యకు మూడెకరాల పొలం ఉంది. అందులో నాకో ఎకరం వస్తుంది." అనుకుంటూ ఏ నైపుణ్యాలూ సంపాదించకుండా బతికెయ్యడానికి మన పల్లెపట్ల జనం అలవాటుపడ్డారు. వ్యవసాయానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు (వారి దృష్టిలో). కనుక వ్యవసాయం విఫలమైనప్పుడు ఏం చెయ్యాలో ప్రత్యామ్నాయ మనుగడ మార్గమేంటో వారికి దిక్కుతోచదు. ఫలితం-ఆత్మహత్య.
ఈ సమస్యకు వెంటనే పరిష్కారం లభించడం కష్టం. మాకూ గుంటూరు జిల్లాలో పొలముంది. ఈమధ్యనే అమ్మేశాం, హైదరాబాదులో కూర్చుని పర్యవేక్షించలేక. నా దృష్టిలో దున్నేవాడిక్కాదు భూమి నివ్వాల్సినది. దున్నగలిగేవాడికే భూమి ఉండాలి. ఎంత భూమైనా సరే ! దానిమీద ఆంక్షలు ఉండకూడదు. ముందు మన జనాన్ని చేతకాని వ్యవసాయం నుంచి మళ్ళించాలని, భూసంస్కరణలు రద్దుచేసి పెద్ద ఎస్టేట్లని ప్రోత్సహించాలని అంటే అదేమీ బూతుమాట కాదనుకుంటా. వ్యవసాయరంగ సమస్యలు సంక్లిష్టమైనవి. నేను వాటన్నింటి గుఱించి సమగ్రంగా మఱింకెప్పుడైనా రాస్తాను.
