
ఒక కార్పొరేట్ గుంపుని తీసుకుంటే అందులో అనేక ఉపసంస్థలుంటాయి. వాటిల్లో ప్రధానసంస్థని Flagship Company అంటారు. మిగతావాటిని subsidiaries లేదా sister concerns అంటారు. సిస్టర్ కన్సర్నుల స్థాపనాది వ్యయాల్ని మొదట్లో ఫ్లాగ్షిప్ కంపెనీయే భరిస్తుంది. సిస్టర్ కన్సర్నులు వ్యాపారపరంగా పూర్తిస్థాయి వ్యవహార దశ (operational_stage) లోకి వచ్చాక మాతృసంస్థ (flagship company) వాటిమీద ఒక్క పైసా కూడా వెచ్చించదు. అలా ఎన్ని ఉపసంస్థలున్నా సరే ! అన్నీ స్వయంసమృద్ధంగా వ్యవహరించాల్సిందే తప్ప ఒక ఉపసంస్థకు చెందిన లాభాల మార్జిన్ని ఇంకో ఉపసంస్థలో మదుపు చెయ్యడానికి వీల్లేదు. చేస్తే దాన్ని ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యంగా భావిస్తారు. ఒకవేళ ఒక ఉపసంస్థ ప్రతి ఆర్థిక సంవత్సరమూ నష్టాలు చూపిస్తూంటే దాన్ని వదిలించుకుంటారే తప్ప దానిమీద పైసా కూడా అదనంగా పెట్టరు.
మఱి దేశమూ, ప్రభుత్వాలూ పై సూత్రానికి మినహాయింపులా ? వీటికి ఏ విధమైన ఆర్థిక క్రమశిక్షణా అవసరం లేదా ? ఒక రంగంలో వచ్చిన లాభాల్ని ఇంకో రంగంలో ఎల్లకాలమూ అలా ఖర్చుచేస్తూనే పోతారా ? అలా ఏ రంగంలో నైతే ఖర్చు చేస్తున్నారో ఆ రంగంలోనివారికి ఏదో ఒక్కసారైనా లాభాలు చూపించే బాధ్యత లేదా ? అలా నిరంతరాయంగా ఖర్చునే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ లాభమూ చూపించని రంగాలకు పెట్టుబడి సరఫరా చేస్తున్న ఇతర రంగాలూ, వాటి అభివృద్ధి శాశ్వతంగా కుంటుపడుతూనే ఉండాలా ?
దీన్నే ఇంకొంత స్పష్టతరమైన శైలిలో పెడితే - స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి వ్యవసాయరంగం మీద ప్రభుత్వానికి ఖర్చే తప్ప ఏ విధమైన ఆదాయమూ లేదు - దాని మీద 65 శాతం మంది బతుకుతున్నప్పటికీ ! వ్యావసాయిక లాభాల మీదనే కాదు వాటి అమ్మకం మీద గాని భూముల అమ్మకం మీద గాని ఎలాంటి పన్నూ (Capital Gains Tax) లేదు.అంటే జనాభాలో 65 శాతం మంది ఆదాయం పన్ను కట్టకుండా బతుకుతున్నారన్నమాట. మఱి ఇందఱు చట్టబద్ధమైన ఎగవేతర్లని పెట్టుకుని ప్రభుత్వం ఎలా నడుస్తోంది ? అంటే ఈ 65 శాతం మంది కోసం తక్కిన 35 శాతం మందినీ పీల్చి పిప్పి చేస్తోంది. అందఱి సంగతీ చూడ్డం ప్రభుత్వానికి విధాయకం కనుక అది సరిపెట్టుకోవచ్చు. కాని ఆ 65 శాతం మందిని భరించడం ఈ 35 శాతం మందికి ఏ విధంగా విధాయకం ? ఏమిటా జన్మజన్మల ఋణం ? ఎందుకు భరించాలి ? ఇందువల్ల ఈ 35 శాతం మంది మీదా భారీగా ఆదాయం పన్నుకోతల శాతాలూ, అమ్మకం పన్నుకోతల శాతాలూ పడి ఎంత నష్టపోతున్నారో, వ్యవసాయం మీద పన్నురూపేణా ఆదాయం లేక యావత్తు దేశమే ఎలా నష్టపోతోందో, ప్రభుత్వాలు ప్రతి అభివృద్ధి పనికీ ఎలా ఘోరంగా అప్పుల పాలైపోతున్నాయో ఎవరైనా గమనించారా ? వ్యవసాయం మీద ఆదాయం లేకపోబట్టి ప్రభుత్వాలు ప్రజలకు తాగుడు మప్పి సంపాదించుకోవలసి వస్తోంది. అత్యంత పెద్ద ఉత్పాదక రంగమైన వ్యవసాయం మీద పన్ను విధిస్తే తాగుడు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ రాజస్వం (revenue) అందుబాట్లోకి వస్తుంది. అప్పుడు మన ప్రభుత్వాలు తాగుడు మీద వచ్చే పాపిష్ఠి డబ్బుకీ, విదేశీ అప్పులకీ స్వస్తి చెప్పగల స్తోమత కలిగి ఉంటాయి.
సరే ! బడుగురైతులు ఆదాయంపన్ను చెల్లించలేరు. ప్రస్తుతం ఆదాయంపన్ను చట్టంలో ఎంతోమందికి ఇచ్చినట్లే వారికీ మినహాయింపు ఇవ్వొచ్చు. మఱి అందఱూ బడుగురైతులేనా ? ఏకమొత్తంగా వ్యవసాయదారులందఱూ పన్నుమినహాయింపుకి అర్హులేనా ? అందులోనూ శాశ్వతంగా ? "మోతుబరి రైతుల్నీ, కామందుల్నీ, భూస్వాముల్నీ సైతం ఆదాయంపన్ను నుంచి ఎందుకు మినహాయించారు ? ఎవఱి బాగు కోసం ఈ పనిచేశారు ?" అని అడిగితే రౌరవాది నరకాలకేమీ వెళ్ళం గదా ! మన రైతుల్లో 80 శాతం మందికి పైగా బడుగులే ఉంటే వ్యవసాయం మీద పన్ను విధించడం ద్వారా ఆశించినంత ఆదాయం సమకూడుతుందా ? అనే సందేహం వ్యక్తం చేస్తారు కొందఱు. ఇక్కడే విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక అయోమయాన్ని విడమర్చాల్సి ఉంది. 80 శాతం మంది బడుగు రైతులంటే దానర్థం - 80 శాతం సాగుభూమి బడుగు రైతుల చేతుల్లోనే ఉందని కాదు. ఈ 80 శాతం మంది చేతుల్లో ఉన్నది 30 శాతం భూమే. మిగతా 70 శాతం భూమీ పెద్దపెద్ద భూస్వాముల చేతుల్లోనే ఉంది. మనం వ్యవసాయం మీద పన్ను విధించబోయేది ఈ 70 శాతం జమీందార్ల భూముల మీదనే. అందుచేత ఇప్పటి నాణెక విలువల్ని (currency value) అనుసరించి ఎకరానికి రు. 500 వార్షిక పన్ను విధించినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీస్థాయిలో ఉంటుంది. ఆ సందర్భంగా 30 శాతం బడుగుభూమినుంచి మాత్రమే మనకు రాజస్వం (revenue) రాదు. ఇలా వ్యవసాయరంగం నుంచి ప్రభుత్వానికి క్రమబద్ధమైన నికర వార్షికదాయం ఉండే పక్షంలో మనం దానితో ఒక రాష్ట్ర రైతు సహాయనిధి ఏర్పఱుస్తాం. కేంద్రసహాయం కోసం గోతికింద నక్కల్లాగా ఎదురుచూసే పని ఉండదు. వఱదలొచ్చి లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమైనా మనం వెనువెంటనే పూర్తి పెట్టుబడి ఖర్చుల్ని నష్టపరిహారంగా ఇచ్చి రైతుల్ని ఆదుకోగలుగుతాం. తద్ద్వారా వారు తరువాతి పంట కోసం అప్పుచేసే అవసరం లేకుండా చూడగలుగుతాం. "పన్ను అని పేరుపెట్టే బదులు పంటల బీమా అనొచ్చు గదా !"అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం ఇండియాలో అమలులో ఉన్న బీమాచట్టాల ప్రకారం ఫలానా దానికి బీమా తీసుకోండని ఎవరూ ఎవరినీ ఒత్తిడి చెయ్యకూడదు. మోటారు వాహనాల చట్టంలో మాత్రం ఇలాంటి నిర్బంధ బీమా వెసులుబాటు కల్పించబడింది. ఒత్తిడి చెయ్యకపోతే రైతులందరినీ ప్రభుత్వ రక్షణచ్ఛత్త్రం క్రిందికి తేలేము. పన్ను అంటే అందఱూ కడతారు. బీమా అంటే కొందఱే కడతారు. ఆ కొందఱి నిధులూ కలిపితే అందఱినీ అన్నివేళలా ఆదుకోవడానికి సరిపోవు. ఒక ఇబ్బంది లేకపోలేదు. ఒక శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంకో శాఖకు తరలించే దురలవాటు మన ప్రభుత్వంలో పెచ్చుమీఱిపోయింది. ప్రస్తుతం అన్ని శాఖల కన్నా ఎక్కువగా ఇందుకు బలవుతున్నది దేవాదాయ-ధర్మాదాయశాఖ. అది ఱేపు వ్యవసాయశాఖ కాకుండా మనం ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యవసాయం మీద ప్రభుత్వానికి ఆదాయం లేదంటే దాని అర్థం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదాయం లేదని ! ఏ ఆదాయాన్నీ జాతికి సమకూర్చని గ్రామీణ ప్రాంతాల మీద ప్రభుత్వం ఎందుకు ఖర్చుపెడుతుంది ? అలా ఖర్చుపెట్టమని ఏ మొహం పెట్టుకుని అడుగుతాం ? వ్యవసాయం వల్ల జాతికి ఆహారమూ, కొన్ని పారిశ్రామిక ముడిసఱుకులూ లభిస్తున్నాయి కాబట్టి ఖర్చుపెట్టాలంటారా ? ఖచ్చితంగా అది కాకపోయినా ప్రతి ఇతరరంగం నుంచి జాతికి అదే విధమైన లాభాలు ఉన్నాయి. కాని ఆ రంగాలన్నీ పన్నుచెల్లిస్తున్నాయి. వ్యవసాయం మాత్రం ఎందుకు చెల్లించకూడదు ? వ్యవసాయం మీద పన్ను రాబట్టగలిగితే గ్రామీణ ప్రాంతాల స్థితిగతుల్ని మెఱుగుపర్చడానికి మనకు ఇతోధికమైన అవకాశం లభిస్తుంది కదా ! అదే సమయంలో పట్టణప్రాంతాల వారి మీద ఈ అవాస్తవికమైన, హింసాత్మకమైన పన్నుశాతాల భారం తగ్గుతుంది కదా !
ఈ విధమైన పన్నువిధింపు ద్వారా ప్రభుత్వానికి సమకూడే ద్రవ్యంతో ఒక శాశ్వతనిధి నేర్పఱచి వారికి తగినంత ధర లభించనప్పుడు ఆ ధనంతో ప్రభుత్వమే ఆ పంటనంతా కొనేయొచ్చు. ఆ పరిస్థితి ఉంటే బడుగు రైతులు కూడా ధీమాగా వ్యవసాయం చేయగలుగుతారు. రైతుల నుంచి మనం ఏమీ వసూలు చెయ్యనంతకాలం బడుగురైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటారు.
దీని గుఱించి మఱికొంత రేపటి టపాలో...
