Friday, December 28, 2007

రైతుల ఆత్మహత్యలు-4


ఏ పని చెయ్యాలన్నా ముందు లావుగా డబ్బు కావాలి.కనీసం 20 వేల తెలుగు గ్రామాల్లోనైనా మౌలిక సదుపాయాలూ తద్ద్వారా సన్నకారు రైతుకుటుంబాలకు క్రమబద్ధ ఉపాధీ(regular_employment)కల్పించడమంటే తమాషా కాదు.ఇండియాలో మౌలిక సదుపాయాల్ని చెక్కపలకలతో కల్పించడం సాధ్యం కాదు.ఇటుకా ఇసుకా సిమెంటూ తప్పనిసరి.ప్రస్తుతం ఇటుక ఒక్కింటికీ 4రూ.50 పైసలుంది.సిమెంటు బస్తా రూ.200 దాటిపోయింది.

ఎవరికి వాళ్ళు చేసుకోండని చెప్పడానికి ఈ విధానం ఇదివరకు ఎక్కడా ప్రయోగించి చూడబడ్డ నిరూపిత అభివృద్ధి నమూనా కాదు."అవేర్"మొదలైన స్వచ్ఛంద సంస్థలు కొన్ని మారుమూల గ్రామాల్ని దత్తు తీసుకుని వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన మాట నిజమే.కాని వాళ్ళు ఆ పని ఈ దృష్టితో చెయ్యలేదు.కనుక వారేర్పఱచిన సదుపాయాల్లో వాళ్ళవాళ్ళే పనిచేస్తున్నారు.కనుక ఈ పనికి ముందు ప్రభుత్వమే ప్రయోగాత్మకంగా పూనుకోవాలి.

ఇందులో మూడు అంశాలున్నాయి.ఒకటి-మౌలిక సదుపాయాలు ఏర్పఱచడం(establishment).రెండు-వాటిని నిర్వహించడం, వాటిల్లో పనిచేసేవారికి వేతనాలివ్వగలగడం(running/maintenance).మూడు-వాటిని విస్తరించడం(expansion).

అలాగే అన్ని గ్రామాలకూ ఒకేసారి సేవలు ప్రారంభించడం కుదరదు.గ్రామీణ మౌలిక సదుపాయాల పైలట్ ప్రాజెక్టు కింద మూడు ప్రాంతాల్లోను కొన్నికొన్నింటిని క్లస్టర్స్ గా తీసుకుని ఈ పథకాన్ని అమలుజరపాలి.వాటిల్లో వచ్చిన ఫలితాల్ని మూణ్ణాలుగేళ్ళ పాటు గమనించి విశ్లేషించాక ఇతర గ్రామాలక్కూడా ఈ పథకాన్ని వర్తింపజెయ్యొచ్చు.

ఒకవేళ ఈ పథకం రైతుల ఆత్మహత్యల్ని అరికట్టడంలో సఫలమైతే ఆ విధంగా వర్తించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుందా ?_ఏ అవసరం కలిగినా పంచపాండవులకు శ్రీకృష్ణపరమాత్మే గుర్తొచ్చినట్లు మన ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు తఱచుగా గుర్తొస్తుంది.దీనిక్కూడా ప్రపంచబ్యాంకే శరణ్యమా ?_లేక తద్‌భిన్నంగా మనకు సొంత ప్రత్యామ్నాయ వనరులేమైనా అందుబాట్లో ఉన్నాయా ?

దీనికి సరైన సూటి సమాధానం-ఏ అదనపు వనర్లూ మన ప్రభుత్వం దగ్గర లేవు.

ఎందుకు లేవు ?.....రేపటి టపాలో....

0 వ్యాఖ్యలు: