20.12.07
రైతుల ఆత్మహత్యలు-3
10:54 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: వ్యవసాయం
ప్రతి కుగ్రామంలోను మౌలిక సదుపాయాల్ని కల్పించడం సాధ్యపడదు. కుగ్రామమంటే నేననేది - ఒక వెయ్యి (1,000) మంది కంటే తక్కువ జనాభా గలది. ఎందుకంటే మౌలిక సదుపాయాల్ని వినియోగించుకుని వాటిని నిరంతరాయంగా నడిపించగల ఒక సుస్థిరమైన వాడుకరుల ప్రాతిపదిక (niche user-base) ఒక మోస్తరు పరిమాణం గల జనావాసాల్లో లభ్యమౌతుంది.
మౌలిక సదుపాయాల సేవల్ని వాడుకరులకు ఉచితంగా అందించాలని మనం ప్రతిపాదించబోవడంలేదు. అలాగని వాటిని ఫక్తు వ్యాపార సరళిలోనే నడిపించాలని కూడా మన తాత్పర్యం కాదు. మనం అనుకుంటున్న గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రధాన లక్ష్యం కేవలం గ్రామీణ వినియోగదారుల సేవ మాత్రమే కాక - గ్రామీణుల స్తోమతకు తగ్గవిధంగా సేవలందించేదిగా, రైతు కుటుంబాలకు తక్కువ విద్యార్హతలతో టూకీ శిక్షణతో ఏడాది పొడవునా ప్రత్యామ్నాయ ఆదాయవనరుగా ఉపయోగపడేదిగా, వ్యవసాయ నష్టాల మూలంగా ఏర్పడ్డ జరుగుబాటు లోపాన్ని పూరించేదిగా, వారిని ఆత్మహత్యల విషవలయంలో నుంచి బయటపడేసేదిగా, వారు వలసకూలీలుగా మారకుండా స్థానికమైన పరిసరాల్లోనే వారికి వ్యవస్థీకృతమైన మార్గాన్నిచూపేదిగా ఉండడం.
మన రాష్ట్రంలో ఉన్న 30,000 ల చిల్లర గ్రామాల్లో వెయ్యి పై చిలుకు జనాభా ఉన్నవే అధికం. కనుక చాలా చోట్ల మౌలిక సదుపాయాల కల్పనా నిర్వహణా సాధ్యపడతాయి. అయితే ఇందులో ఇంకో విషయం ఇమిడి ఉంది. దశాబ్దాల తరబడి ఎఱ్ఱజెండాల ప్రచారం వల్ల - "ఏం చేసినా అంతా ప్రభుత్వమే చెయ్యాలనీ మనం చేసేదేమీ లేదనీ ప్రభుత్వమంటే అందరికీ అన్నీ ఉచితంగా ఇచ్చేసే ఇచ్చితీఱాల్సిన ధర్మసత్రమనీ అక్షయపాత్ర" అనీ మన గ్రామీణుల్లో ఒక పొఱపాటు అభిప్రాయం నాటుకుపోయింది. ఊళ్ళోవాళ్ళంతా ఇంటిమీద పడితే ఎంత అమీరైనా క్షణంలో గరీబవుతాడు. అతని మీదపడి దోచినవాళ్ళు అతనిలా అమీర్లు కాలేరు గాని ఆ అమీరు మాత్రం తన మీదపడ్డ గరీబుల్లో తానూ ఒకడవుతాడు. హైదరాబాదులో ప్రభుత్వమనే మనిషెవడూ లేడు. ప్రభుత్వం దగ్గఱ డబ్బులు కాచే చెట్టు కూడా ఏమీ లేదు. మన దగ్గఱ వసూలు చేసిందే మన కోసం ఖర్చుపెట్టాలి. ప్రభుత్వం అలా వసూలుచెయ్యాలంటే మనం ప్రభుత్వానికి ఇవ్వాలి. ముందు ఇచ్చాక మనకు ప్రభుత్వాన్ని నిర్మొహమాటంగా నిలదీసే హక్కు వస్తుంది. ఇది ఈ బ్లాగు చదివే నవీన విద్యావంతులకు బాగానే అర్థమౌతుంది. కాని మన గ్రామీణులకు మాత్రం అంత సులభంగా బోధపడదు. వాళ్ళకు నిజంగా బోధపడితే వోట్లెయ్యడానికి డబ్బు తీసుకోరు.
మౌలిక సదుపాయాల సేవల్ని ఇలా ఒక వెలకు వినియోగించుకోవాలనే ఆలోచనకు మన గ్రామీణుల్ని ముందుగా మానసికంగా సన్నద్ధం చేశాక మన పని సులభతరమౌతుంది. గ్రామీణుల దగ్గఱ వసూలు చేసే వాడుక-రుసుముల (user-charges) తో మౌలిక సదుపాయాల్ని నడిపించడమూ, వాటిల్లో పనిచేసే రైతుకుటుంబాల సభ్యులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమూ ఆచరణాత్మకంగా సాధ్యపడుతుంది. మన వ్యవసాయం పుష్కలమైన నీటిపాఱుదల సౌకర్యం గల బహుకొద్ది జిల్లాలలో మినహా రైతులకు ఏడాది పొడవునా పని కల్పించడంలో విఫలమౌతోంది. కనుక ఈ చర్య అత్యావశ్యకం. ఇది వలసల్ని నిరోధిస్తుంది. జఱుగుబాటు లేక మనిషి తనను తాను అసహ్యించుకుని ఆత్మహత్య అనే అమానవీయ చర్యకు పాల్పడకుండా ఆశారేఖల్ని అతనిలో వెలిగిస్తుంది. ప్రతి సన్నకాఱు రైతుకుటుంబం నుంచి కనీసం ఒక్కఱికి ఉపాధి ఏర్పడేలా మనం నిబంధనల్ని రూపొందించుకోవాలి.
మౌలిక సదుపాయాల కల్పన ఉన్నపళాన వెంటనే మన రైతుజీవితాల రూపురేఖల్ని మార్చిపారెయ్యదు. వాటి మధుర ఫలాలు గ్రామీణులకు అందడానికి కొంత పొదుగుడు కాలం (gestation_period) తీసుకుంటాయి. ఏర్పఱచాలే గానీ ఒకటి-రెండేళ్ళలోనే చాలావరకు మన గ్రామీణచిత్రంలో గణనీయమైన మార్పు కనిపిస్తుందని నా విశ్వాసం.
మన గ్రామాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు ?
1. ప్రాథమిక పాఠశాల - 8 మందికి ఉపాధి
2. ఉన్నతపాఠశాల - 10 మందికి ఉపాధి
3. బ్యాంకు - 5గురికి ఉపాధి
4. ఆసుపత్రి - 6గురికి ఉపాధి
5.గ్రంథాలయ-పఠనమందిర-ఉపన్యాస భవన - అంతర్జాల కేంద్ర - దూరదర్శన - సముదాయం (దీన్నే కల్యాణమండపంగా చేసి అప్పుడప్పుడు అద్దెకివ్వొచ్చు) - 8 మందికి ఉపాధి
6. అన్ని రకాల వాహనాలకూ మరమ్మత్తుల సముదాయం - 10 మందికి ఉపాధి (వీళ్ళలో ఒకఱు వాహన విడిభాగాల విక్రేత)
7. పంచాయితీ సర్కిల్ ఆఫీసు - 4గురికి ఉపాధి (పన్నుల వసూలు, భూమి సర్వేలు, ప్రజాపనులు, ప్రజాసంబంధాలు మొ.)
8. గ్రామీణ రక్షక దళం (స్థానిక పోలీసు వ్యవస్థ-Civil Patrolling Outpost)- 10 మందికి ఉపాధి (పగటి కర్తవ్యకారులు 5గురు ; రాత్రికి 5గురు)
9. బట్వాడా ప్రతినిధి - ఒకరికి ఉపాధి (ఇతడు/ఈమె రోజుకొకసారి సమీప తపాలా కార్యాలయానికి వెళ్ళొస్తారు.ఇతడు/ ఈమె అందజేసిన ప్రతి ఉత్తరానికీ, పార్సెల్కీ స్థానిక ప్రజలు అర్ధరూపాయి నుంచి రూపాయి దాకా చెల్లించాలి)
ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటి నిర్వహణలో సగం ఖర్చు జిల్లా యంత్రాంగం భరించాలి. మిగతా సగం స్థానిక ప్రజల నుంచి రుసుముల రూపేణ వసూలు చెయ్యాలి. నిర్వహణ సంగతి తరువాత ! అసలు మొదటి అడుగు పడేదెలా ?
(మిహతా వచ్చే టపాలో...)
