Saturday, December 15, 2007

రైతుల ఆత్మహత్యలు-2

జనాభా యొక్క పరిమాణమూ జీవన విధానమూ పోకడలూ (trends)చాలా తఱచుగా మారిపోయే సమాజాల్లో గిరాకీ-సరఫరా(Demand and Supply)లాంటి విపణి సూత్రాలు(market_principles)బాగా ప్రాధాన్యం వహిస్తాయి.పూర్వసమాజాలు ఇలాంటివి కావు గనుక వాటిల్లో గిరాకీ స్థిరం.సరఫరా కూడా స్థిరమే.గిరాకీని బట్టి మనుషులు తమ నైపుణ్యాల్ని మార్చుకుంటారు,తీర్చిదిద్దుకుంటారు.మనలాంటి అస్థిరమైన ఆర్థికవ్యవస్థల్లో బ్రతకాలంటే ఒక మనిషికి ఒకటి కంటే ఎక్కువ నైపుణ్యాలు అవసరం.ఒకే కుటుంబంలో ఇద్దరు సంపాదించడం కంటే ఒకే మనిషికి రెండుమూడు నైపుణ్యాలుండడం ఎక్కువ ప్రయోజనకరం.ఒక ఉపాధ్యాయుడికీ వ్యాపారికీ మృదుసామాన్ల నిపుణుడికీ ఇది ఎంత వర్తిస్తుందో రైతులకూ అంతే వర్తిస్తుంది.

మన అసలు సమస్య ఇక్కడే ఉంది.అది-మన రైతులకు సాగు తప్ప వేఱే నైపుణ్యాలేమీ లేకపోవడం.అసలు ఏ నైపుణ్యాలూ లేనివాళ్ళూ అవి సంపాదించుకునే అవకాశం కూడా లేనివాళ్ళూ మాత్రమే సాగులో చొఱబడుతున్నారని ఇంతకుముందే అనుకున్నాం.అయితే నైపుణ్యాలు వికసించడానికి అవసరమైన వాతావరణం లేకుండా వాటిని సంపాదించాలనే ఇచ్ఛ కూడా కలగదు.ఆ నైపుణ్యాలకొక తక్షణ ప్రయోజనమూ, వినియోగ్యతా తాము నివసించే పరిసరాల్లో ఉండాలి.అణుశక్తి కేంద్రాలు లేని దేశంలో ఆ శాస్త్రం చదివిన మేధావికి వలసపోవడం తప్ప గత్యంతరం ఉండదు.ఇది మఱీ పెద్ద ఉదాహరణ అనుకోండి.ప్రస్తుతం ప్రయోజనమూ, వినియోగ్యతా అనేవి మన దేశంలో పట్టణప్రాంతాల్లో మాత్రమే లభ్యమౌతున్నాయి.అందుచేత సాగు చెయ్యలేక పట్నాలకు వలసవచ్చి ఏదో ఒక ఇతరనైపుణ్యాన్ని అలవర్చుకున్న గ్రామీణులు రెండు పూటలా అన్నం తినగలుగుతున్నారు.తిరిగి పల్లెకు పోవడానికి ఇష్టపడట్లేదు కూడా.

ఇందుకు భిన్నంగా మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర నైపుణ్యాల అభివృద్ధికి ఏం చెయ్యాలో మనం ఆలోచించాలి.ఇక్కడ వ్యవసాయం అంటే కేవలం దుక్కిదున్నడం కాకుండా తత్సంబంధితమైన ఇతర కార్యకలాపాలు(allied_activites)కూడా వస్తాయి.ఈ పని చెయ్యకుండా ఎన్ని పావలా వడ్డీలైనా ఋణాల మాఫీలైనా ఉచితవిద్యుత్తులైనా అలాంటి ఏ ఇతర ధర్మసత్రపు చర్యలైనా సరే గ్రామీణుల్ని ఉద్ధరించవు.వాస్తవం చెప్పాలంటే పైన పేర్కొన్న ధర్మసత్రం చర్యలన్నీ అసలు సమస్యల మూలాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడని రాజకీయ జీవుల సృష్టే తప్ప-రైతులెప్పుడూ తమకు అవి కావాలని అడగలేదు.రైతులేమీ భిక్షగాళ్ళు కారు.వాళ్ళకు ఆత్మాభిమానమూ ఆభిజాత్యమూ ఉన్నాయి.వాళ్ళు ఏదీ ఊరికే వచ్చిపడాలని కోరుకోరు.వాళ్ళు ఆశిస్తున్నదల్లా కొంచెం అవగాహన, కాస్త మార్గదర్శనం.అంతే ! అయితే వాళ్ళకు ఆ రెండూ తప్ప మిగతావన్నీ పుష్కలంగా అందుతున్నాయి.

నాగరికత యొక్క ప్రాథమిక దశల్లో ఆహారం డబ్బుని సృష్టిస్తుంది.కాని నాగరికత పరాకాష్ఠకు చేరుకున్న దశలో డబ్బే ఆహారాన్ని సృష్టిస్తుంది.ఆ డబ్బు ఇప్పుడు నైపుణ్యాల సక్రమ వినియోగం ద్వారా సృష్టించబడుతోంది.నైపుణ్యాలకు తమ పరిసరాల్లో తక్షణ ప్రయోజనం ఏర్పడాలంటే ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు(infrastructure)ఏర్పడాలి.సదరు మౌలిక సదుపాయాల్ని నడిపించడానికి ఆ నైపుణ్యాలు ఉపయోగపెట్టబడతాయి.తద్ద్వారా నిరుద్యోగం తగ్గుతుంది.ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక చిన్న క్లినిక్ ఉంటే-అక్కడొక మందుల కొట్టు అవసరమౌతుంది.ఆ క్లినికి కి ఒక నర్సు, ఒక కాంపౌండరు, ఒక పారిశుద్ధ్య కార్మికుడు/కార్మికురాలూ అవసరమౌతారు.ఒక గుడి ఉన్నా బడి ఉన్నా మఱొక గ్రంథాలయ-పఠనమందిరం ఉన్నా ఇలాగే వాటిల్లో ఒక్కొక్కదాన్నీ ఆశ్రయించుకుని డజనో అరడజనో ఉద్యోగాలేర్పడతాయి.కాని మన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నవి బహుకొద్ది.మన దేశపు అభివృద్ధికి ఉన్న ఉన్న ప్రధానమైన చీకటికోణం ఇదే.మన దేశంలో నగరాలకే మౌలిక సదుపాయాలు లేవు.ఈ దేశంలో ప్రభుత్వ కార్యాలయాలు సైతం కిరాయికి తీసుకున్న వివిక్త(private)భవనాల్లోనే నడుస్తాయి.ఉదాహరణకు-హైదరాబాదులో ప్రతి చదరపు కిలోమీటరుకు ఎన్ని గ్రంథాలయాలున్నాయి ? ఎన్ని పార్కింగు లాట్లున్నాయి ? ఎన్ని పార్కులు ఉన్నాయి ? ఎన్ని ఆటస్థలాలున్నాయి ? పిల్లలు రోడ్ల మీద క్రికెట్టాడే పరిస్థితి ఎందుకొచ్చింది ? లెక్కవేసి ఆలోచించండి. ఇక పల్లెల కోసం ఏమాశిస్తాం ? మన దేశంలో ఇప్పుడందరూ మౌలిక సదుపాయాల సంగతి విస్మరించి చాలా పెద్ద యెత్తులెత్తుతున్నారు.చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.వాస్తవానికి భారీ చేపట్ల(projects)లో ఒక ఉద్యోగావకాశాన్ని కల్పించడానికి కోటి నుంచి పదికోట్ల దాకా ఎంతైనా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.అంత చేసినా బహుకొద్దిమంది సుశిక్షితులైన మేధావులకు మాత్రమే వాటిల్లో ఉపాధి లభిస్తుంది.మౌలిక సదుపాయాల రంగంలో అంత పెట్టుబడి అవసరం లేదు.ప్రతిలక్ష-రెండులక్షల రూపాయల పెట్టుబడికొకరు చొప్పున ఉపాధి కల్పించవచ్చు.మౌలిక సదుపాయాల్ని నిర్వహించడానికి పెద్దగా విద్యార్హతలు గానీ శిక్షణ గానీ అవసరం లేదు కూడా.

నైపుణ్యాలు ఎక్కువ సందర్భాల్లో అక్షరాస్యతని ఆశ్రయించుకుని ఉంటాయి.ఒకప్పుడు అన్నం ఉన్నవాడు విజ్ఞానాన్ని కూడా సంపాదించేవాడు.ఇప్పుడు విజ్ఞానమే మనిషికి అన్నం పెడుతోంది.అక్షరాస్యత పుష్కలంగా ఉన్న దేశాల్లో దాన్ని వినియోగించుకుని వేలాది కోట్ల డాలర్ల భారీస్థాయిలో వ్యాపారాలు కూడా నడుపుతారు.అక్కడ అమ్మేదీ కొనేదీ అంతా సమాచారమే.మఱి మన పల్లెల్లో అక్షరాస్యతే కఱువు.సర్వశిక్షా అభియాన్ నిధుల్ని తినేసే ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో రైతుల కంటే ముందు అక్షరాస్యతే ఆత్మహత్య చేసుకుంటోంది.ఇక మన రైతులకు ఏ విధంగా ఇతర నైపుణ్యాల్ని అలవఱుస్తాం ? ఎలా వాళ్ళని ఈ ఆత్మహత్యల విషవలయంలోంచి ఇవతల పడేస్తాం ?

5 వ్యాఖ్యలు:

దీపు చెప్పారు...

మంచి పరిశీలన... కొంచెం అవగాహన ఉండి, కాస్త నిశితంగా పరిశీలించే ఎవరికైనా గ్రామీణ సమస్యలు అర్ధమవుతాయి... నేటి కాలంలో ఫలితాలు రాబట్టడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు అని నా అభిప్రాయం.. చిత్తశుద్ధి, కార్యదీక్షత ఉన్న కొద్ది మంది అది సాధించగలరు... ఇది మాటల్లో తేలికగానే ఉంటుంది అని కొట్టిపాసేవాళ్ళు ఉంటారు... కానీ నిజంగానే తేలిక అని మొదలుపెట్టరు... ఎందుకంటే మనం సమస్యని మరింత జఠిలం చెయ్యడం, ఆ కొద్ది పాటి సమయాన్ని కూడా ఎదురుచూసే ఓపిక లేకపోవడం, ప్రవాహంలో కొట్టుకుపోవడం, అస్థిత్వాన్ని కోల్పోవడానికి అలవాటుపడిపోయాము...

సమాచార రంగం ఇంతలా అభివృద్ధి చెందింది కాబట్టి, మౌలిక సదుపాయాలు, సేవల విషయం లొ గ్రామాల్లో ఉండే వారి సాయం తీసుకోవచ్చు... ఏదొక నైపుణ్యంలో నిష్ణాతులని చెయ్యొచ్చు.. అది వ్యవసాయానికి అదనంగా వారికి అక్కరకొస్తుంది...

సూర్యుడు చెప్పారు...

This is a bit more balanced analysis than the one in your earlier article. There are so many problems but nothing is impossible. We should have the will to solve the problems.

When I used to listen to All India Radio programs during the noon sessions, I remember, they used to advise the farmers that they have to have another practice, like cattle farms, silk farming, and some more on the same lines to take care of any risks in the agriculture.

Best regards,
sUryuDu

రానారె చెప్పారు...

తాడేపల్లిగారూ,
చంద్రబాబునాయుడి పాలనలో జరిగిన శ్రమదానం, ప్రతి పల్లెకూ రోడ్డుమార్గం, శుభ్రతకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు జరిగేవి కదా. ఎవరెవరు ఎంత తిన్నారనే విషయాన్ని ప్రస్తుతానికి పక్కనపెడితే, ఆ ప్రయత్నాన్ని "పల్లెల్లో మౌలికవసతులను మెరుగుపరచడం" అనొచ్చా? మీరు ఔనంటే, అలాంటి ప్రయత్నాలను ముమ్మరం చేయడం మీరు ఈ టపాలో సూచిస్తున్న మార్గమని అనుకోవచ్చా?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...
ఈ పోస్ట్‌ను బ్లాగు రచయిత తొలగించారు.
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

మన ప్రస్తావనలో మనం చర్చిస్తున్నవి శ్రమదానం, పనికి ఆహారపథకం, పనిహామీ పథకం మొ. కావు. మౌలిక సదుపాయాలంటే నా దృష్టిలో ఉన్నవి రోడ్లూ, వీధిదీపాల కంటే కొంచెం ఖరీదైనవి.

ఈ టపాల చర్చావిషయం : గ్రామాల్ని ఇతోధికంగా నివాసయోగ్యంగా మార్చడానికి వీలు కల్పించే సామాజిక ఆస్తుల పెంపుదల, వాటి నిర్వహణ (మెయింటినెన్సు) నిమిత్తం సన్నకారు రైతు కుటుంబాల వారికి శిక్షణ, తద్ద్వారా వారికి నింపాది అయిన నెలవారీ ఆదాయం మొ.

గ్రామాల్లో సన్నకారు రైతులకు ఇప్పుడున్న వ్యవసాయంతో పాటు సమాంతర, అంశకాలిక (part-time) ఆదాయవనర్లని కల్పిస్తే వాళ్ళకు అప్పుచేసే అవసరం ఇంత తఱచుగా కలగదని నా ఆశంస (expectation). వ్యవసాయం పూర్తిగా మానిపారెయ్యండని కాదు. "రైతుల ఆత్మహత్యలు-3" అనే టపాని కూడా ఒకసారి పరిశీలించగలరని ప్రార్థన.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.