ఈ జమాఖర్చుల పద్దు దేనికంటే - ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, బదులుగా మనకేమిస్తున్నారీ నిర్మాతలూ దర్శకులూ నటులూ ? అని ప్రశ్నించుకోవడానికి.సినిమాని నేను ప్రాథమికంగా ఒక కళగానే భావిస్తాను.వ్యాపారమని కొందరు అంటారు.అది స్వతహాగా వ్యాపారం కాదు.వ్యాపారంగా మార్చబడింది, విద్యలాగా వైద్యంలాగా వివాహంలాగా ! మొదట్లో సినిమాలు తీసినవాళ్ళు కళాదృష్టితోనే తీశారు.సాంస్కృతిక దృష్టితో తీశారు.తెలిసిన కథల్ని తెఱమీద చూసుకుని మనసారా ఆనందించాలనే తపనతో తీశారు.అందుకే మనకు మొదట్లో దేశవ్యాప్తంగా వచ్చిన సినిమాలన్నీ పౌరాణికాలే.వాటిల్లో నటించినవాళ్ళు కూడా ఆ దృష్టితోనే నటించారు.వారు దాన్నొక ధనసంపాదనా వ్యాసంగం (career)గా భావించలేదు.తొలి తెలుగు సినీ హీరో శ్రీ రామానుజాచార్యులు ఆ తరువాత వచ్చిన సినిమాల్లో నటించడానికి ఇష్టపడలేదు.సినిమా ప్రక్రియ 1960 ప్రాంతాల్లో తన కళాప్రకృతిని కోల్పోవడం మొదలుపెట్టింది.మన కాలానికొచ్చేసరికి "అది అసలు కళే కాదు, వ్యాపారం"అని సినిమావాళ్ళే బాహాటంగా అనేసే పరిస్థితి వచ్చింది.మనమూ తలూపుతున్నాం, ఏమనాలో అర్థం కాక !
ఇది వ్యాపారమైతే, అన్ని వ్యాపారాల్లో లాగే దీంట్లో కూడా ఒక ఉత్పత్తి, దాని అమ్మకందారు, కొనుగోలుదారు, ధరకు తగ్గ నాణ్యత, మన్నిక వగైరా అన్నీ చూసుకోవాలి కదా ! ఉత్పత్తిలో కొత్తదనమేదైనా ఉండాలి కదా ! మఱి ఏముంది ?
1. గతంతో పోలిస్తే ఇప్పటి తెలుగు సినిమాలు వాసిలోనే కాదు, రాశిలో కూడా తగ్గిపోయాయి.ఆ రోజుల్లో తెలుగు సినిమా అంటే కనీసం రెండున్నర గంటల నుంచి 3 గంటల దాకా నిడివి కలిగి ఉండేది.ఇప్పుడు ఏ సినిమా కూడా రెండు గంటలకు మించి ఉండడంలేదు.కారణాలు మనకు అనవసరం.మన వినోదంలో భారీగా కోతపడిన మాట నిజం.మనం పెట్టే డబ్బుకు న్యాయం జరగడంలేదు.
2. పాత సినిమాల్లో ప్రతి సందర్భానికీ ఒక వైవిధ్యభరితమైన పాట ఉండేది.ఆనాటి కవులు ఏ ప్రస్తావన మీదైనా పాట రాయడానికి సిద్ధంగా ఉండేవారు.
"పద, పదవె వయ్యారి గాలిపటమా !"
"బొమ్మాలమ్మ బొమ్మలూ....భలే బొమ్మలూ"(సువర్ణసుందరి)
"తెలుసుకొనవె యువతీ ! అలా నడుచుకొనవె యువతీ"
ఈ జాబితాకు అంతులేదు.ఈ రోజు సినిమావాళ్ళు మనకిస్తున్నదేమిటి ? విదేశాల్లో తీసిన బృంద బీభత్సాలు తప్ప ? ఏ ఇతర సందర్భానికీ పాట ఉండదు.అక్కఱలేదని వాళ్ళకు వాళ్ళే నిర్ణయించేసుకున్నారు.
3. ఒక భాషలోని సినిమాలు తఱచుగా చూస్తూ ఉంటే ఆ భాష పట్టుబడే అవకాశం ఉంటుంది.కాని ఇప్పటి తెలుగు సినిమాలతో ఆ అవకాశమే లేదు.దీనికి 3 కారణాలు.1. ఏ ఇతర భాషా పరిశ్రమా ఇవ్వనన్ని అవకాశాలు తెలుగేతరులకు కల్పిస్తోంది తెలుగు పరిశ్రమ.వాళ్ళు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేరు.చెప్పిన డబ్బింగుకు పెదవులు కదుపుతారంతే ! ఆ కదపడం కూడా వైనంగా ఉండదు.కనుక పలికే పదాలు వేఱు.కదిలే పెదాలు వేఱు. 2.కారణం తెలియదు కాని - ఇప్పటి తెలుగు సినిమాలన్నీ గోదావరి జిల్లాల మాండలికంతో నింపివేయబడ్డాయి.నేను కాకినాడలో అయిదేళ్ళున్నాను.అక్కడ మాట్లాడేది మలయాళంలా శరవేగవంతమైన మాండలికం.గుంటూరుతో సహా ఏ ఇతర జిల్లాల వాళ్ళకైనా అది చప్పున అర్థం కావడం కష్టం.గోదావరి ప్రాంతీయులు కానటువంటి నటులతో కూడా ఆ మాండలికంలోనే మాట్లాడిస్తున్నారు.ఫలితంగా సినిమాలో ఒక డైలాగు గాని చెణుకు గాని సందర్భాన్ని గాని మనసారా ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడింది.ముందు అసలు ఏం మాట్లాడుతున్నారో వినిపిస్తే గదా ! ఒకరు డైలాగు చెబుతూండగానే ఇంకొకరు ఎత్తుకుంటారు.మళ్ళీ దానికి తోడు బిగ్గరగా వెనక నుంచి నేపథ్య సంగీతం ఒకటి. 3.ఏ మాండలికమైనా గానీ, అందులో ఇంగ్లీషే ప్రాజ్యం, తెలుగు మాత్రం పూజ్యం.పాత తెలుగు సినిమాలు చూసేటప్పుడు మనకు ఈ ఇబ్బందులేవీ ఎదురుకావు.
4. ఇంత గొప్ప దర్శకులు ఏదో పొడిచేస్తారనుకుంటే ఎత్తుకొచ్చిన కథలతో, ఈ రాష్ట్రప్రజల జీవనశైలిలో బొత్తిగా ఇమడని విడ్డూరపు టాచారాలు చూపిస్తూ "నేటివిటీకి దగ్గరగా తీశా"మని బుకాయిస్తూంటే ఏమనాలి ?
5. పాత సినిమాల్లో కథావైవిధ్యానికి కారణం - వాళ్ళు ఎంచుకున్న పాత్రల ఆర్థిక నేపథ్యం (economic background).ఆ పాత్రలు మధ్యతరగతిలో నుంచి ఎంచుకోబడ్డాయి.ఎందుకంటే అప్పటి దర్శకులూ నటులూ కూడా అందులోనుంచి వచ్చినవాళ్ళే.అందుకని అంతులేని వెరైటీ చూపించగలిగారు.మన కాలపు దర్శకులూ నటులూ మధ్యతరగతి హృదయస్పందనలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినవాళ్ళు.వీళ్ళ లోకమే వేఱు.అందుకని వీళ్ళు సృష్టించే పాత్రలన్నీ వీళ్ళ తరగతికే చెందినవై ఉంటున్నాయి.(ఈటీవీలో సుమన్ సృష్టించే పాత్రలు కూడా రామోజీరావు కుటుంబంతో ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్లే ఉంటాయి) ఆ నిర్మాతల యొక్క దర్శకుల యొక్క నటుల యొక్క వలయంలో నిజజీవితంలో జరుగుతున్న వ్యాపారాలే, సినిమాలో హీరో/హీరోయిన్ పాత్ర కూడా చేస్తూంటుంది.లేదా అలాంటి వ్యాపారం చేసే సంస్థలో హీరో ఉద్యోగం చేస్తూంటాడు.
ఇలా చెప్పాలంటే చాలా ఉంది.కాని ఇంత నమ్ముకున్నందుకు ఇంత గౌరవిస్తున్నందుకు మన నోట్లో ఈ సినిమావాళ్ళు కొట్టాల్సిన మట్టి ఇదా ? దీనికి పరిష్కారం....వచ్చే టపాలో ...
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.