Saturday, October 06, 2007

రహస్యమంత్రం (Unlearn...Unlearn...Unlearn...)

చాలా కాలం క్రితం ఒక పిచ్చిపిల్ల ఉండేది.ఆమె తన మొగుడే ప్రపంచంలో అందరికన్నా చాలా గొప్పవాడని నమ్ముతూండేది. ఆమెనొక దుర్మార్గుడు ఎత్తుకెళ్ళాడు. వాడు నిజానికి అప్పటి ప్రపంచం దృష్టిలో ఆమె మొగుడికన్నా అన్ని విధాలా గొప్పవాడు.ఆ విషయం ఆమెకి తెలియజెప్పాలని మనుషుల్ని కూడా ఏర్పాటుచేశాడు.వాళ్ళు అతని గొప్పతనం గురించి చెబుతూ ఆమె బుఱ్ఱ తినేశారు.కాని ఆ పిచ్చిపిల్ల తన మొగుడే అందరి కన్నా గొప్పవాడని బల్ల గుద్ది వాదించింది.తరువాత జరిగిన యుద్ధంలో సమకూడిన విజయం వల్ల ఆమె మొగుడు నిజంగానే గొప్పవాడయ్యాడు.అందరూ అతన్ని దేవుడని కొలవడం మొదలుపెట్టారు.ఆమే గనక మనసు మార్చుకుని ఉంటే అతన్నెవరూ దేవుడుగా కొల్చేవారు కారు.

చాలా సంవత్సరాల క్రితం గుజరాతులో ఒక పిచ్చి పిల్లాడు ఉండేవాడు.వాడు శ్రవణకుమారుడి కథ సత్యహరిశ్చంద్రుడి కథ నాటకాలుగా చూసి తానూ అలాగే అవ్వాలని తహతహలాడాడు. ఆ కథలన్నీ నిజమని నమ్మాడు.ఆ ఆదర్శాలు నిజమని నమ్మాడు. ఇప్పుడు ఆ పిల్లాడి పుట్టినరోజు వందలాది దేశాలకు పండుగగా మారింది.అతని శత్రువులు అతనికి పాదాభివందనం చేస్తున్నారు.అతని పేరిట దేశాధినేతలే ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు.అతను ఏ మతాలూ స్థాపించలేదు.ఏ మతాన్నీ సంస్కరించలేదు.ఉన్న మతాన్ని చేతనయినంత ఆచరించి చూపించాడంతే ! అతని తరఫున మాట్లాడ్డానికీ అతని గురించి ప్రచారం చెయ్యడానికీ ఎవరూ లేరు.అయినా అతను ఈరోజు అందరికీ తెలుసు.

పిచ్చితనం గెలిచింది.అమాయకత్వం గెలిచింది. ప్రేమ గెలిచింది.అభిమానం గెలిచింది.

స్వార్థం ఓడిపోయింది. అతితెలివి ఓడిపోయింది. ద్వేషం ఓడిపోయింది.

ప్రపంచంలో అన్ని గొప్పతనాల వెనుకా ఉండేది అమాయకత్వమే. తెలివితేటలు కాదు. ఇది దేవుడి శాసనం . ఇది జీవిత వాస్తవం.

8 వ్యాఖ్యలు:

తెలుగు వీర said...

సాష్టాంగ వందనాలు. ఇది చదువుతూ కళ్ళు చెమ్మగిల్లాయి.

radhika said...

200/100

కొత్త పాళీ said...

ఈ టపా మొదట చదవంగానే సీత తత్త్వాన్ని ఎంత అందంగా చెప్పారు అనుకున్నా. వ్యాఖ్య రాయడనికి లంకె కనబళ్ళేదు. త్యాగరాజ స్వామి చెప్పనే చెప్పారు ఖ్యాతి అంతా రాముడుదైనా, వెంకకారణం సితయేనని "మాజానకీ చెట్టబట్టగా" ..

teluguabhimani said...

ఏందన్నా కరుణానిధి గిట్ల మీదికొచ్చిండా నీకు. ఇంత సదువుకోని ఫాయిదేముంది? రాముని కంటె రావనుడు గొప్పోడంటావ్? దైవబలం రాచ్చసుల్లెక్క మాట్లాడొద్దె.

రానారె said...

వావ్!! మంచి ఆలోచన. ధన్యవాదాలు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

తెలుగాభిమాని గారూ ! మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. సీతమ్మవారిని ఎత్తుకెళ్ళేనాటికి ప్రపంచం భావ్న అదే. ఎందుకంటే రాములవారు అప్పటికి రావణుడి లా తపస్సు చెయ్యలేదు. వరాలు పొందలేదు. రావణూడిలా సామ్రాజ్యాన్ని స్థాపించలేదు. పైగా రాజ్యాభిషేకాన్ని కోల్పోయి అడవుల్లో సంచరిస్తూ ఉన్నారు. అందుచేత ఆయన సమకాలీన ప్రపంచం దృష్టిలో ఆయన అప్పటికి సామాన్యుడే. సీతమ్మవారు కూడా రావణుడే ఘనుడని నమ్మడానికి తగినన్ని కారణాలున్నాయి. కాని ఆవిడ వాణ్ణీ నిర్మొహమాటంగా తృణీకరించింది. తన భర్త వచ్చి రావణుణ్ణి చంపి తనని తీసుకెళతాడో లేదో తెలియకపోయినా ! రావణుణ్ణి చంపాక గదా రాములవారు భగవదవతారమని ప్రపంచానికి వెల్లడైనది. మనమందరమూ తరువాత తెలుసుకున్నాం. తన భర్త దేవిడనే విషయాన్ని అమ్మవారు మనందరి కన్నా ముందే తెలుసుకున్నారు. అమ్మవారు ఆ విధంగా రామభక్తుల్లో తొట్టతొలివారు. ఆవిడ నుంచే మనం రామభక్తిని అలవాటు చేసుకున్న్నాం. తల్లిని బట్టే సంతానం కదా !

భగవంతుడే స్వయంగా దిగివచ్చినా సమకాలం వారు నమ్మరు. శ్రీకృష్ణ భగవానులవారు ఉన్నంతకాలం ఆయనకు భక్తుల కన్నా శత్రువిలే ఎక్కువగా ఉండేవారు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

అయినా మీరు ఎత్తి చూపాక ఆ వాక్యాన్ని సవరించా లెండి. నెనర్లు.

వికటకవి said...

అయ్యా తాడేపల్లి గారూ,
సీతమ్మ వారి గొప్పతనం ఒక ప్రత్యేక పద్ధతిలో బాగా చెప్పారండి. చాలా నచ్చింది.

http://sreenyvas.wordpress.com