Wednesday, August 22, 2007

ఒక డాక్టర్‌గారి కథ-4

డాక్టర్‌గారి చిన్నన్నయ్య, శాస్త్రి L.C.E. చదవడం పూర్తయ్యాక రాష్ట్రప్రభుత్వంలో సివిల్ ఇంజినీరుగా చేరి కొన్ని చరిత్రాత్మక కట్టడాల నిర్మాణంలో ప్రముఖపాత్ర పోషించాడు.ఉదాహరణకి నాగార్జునసాగర్ మీద రోడ్డువేత పనులు ఆయనే పర్యవేక్షించాడు.ఈ క్రమంలో ఆయన టి.సుబ్బరామిరెడ్డికి బాగా దగ్గరయ్యాడు.అందుకని హైదరాబాదులో మహేశ్వరి-పరమేశ్వరి జంటథియేటర్ల నిర్మాణం పనుల్ని శాస్త్రికే అప్పగించాడట సుబ్బరామిరెడ్డి.ప్రస్తుతం ఆ థియేటర్లు మూతపడ్డాయనుకోండి.

ఇవి కాక శాస్త్రి ప్రైవేటు కాంట్రాక్టుల్లోను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను ప్రవేశించి కోట్లు సంపాదించాడు.సికింద్రాబాదు సిఖ్ విలేజ్ దగ్గర తన పేరుమీద ఒక కాలనీ కూడా కట్టించాడు.అదో పెద్ద విశేషమేమీ కాదు.అసలు విషయం-ఆయన ఎంతమంది స్త్రీలని ఉద్ధరించాడన్నదే.ఆయన ఒంటిమీద ఎన్నో పులిపిరికాయలు పెరిగి వేళ్ళాడుతూండేవట."వాడికి ఒంటినిండా లింగాలే"అని వ్యాఖ్యానించారు వెంకటేశ్వర్లుగారు.శాస్త్రికి దశాబ్దాలు గడిచినా సంతానం కలగలేదు.సాంప్రదాయిక పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయన విశాల హృదయంతో సృజనాత్మకంగా బయట ఎన్నో ప్రయోగాలు చెయ్యగా చెయ్యగా ఒక మాల స్త్రీ ద్వారా ఒక కూతురు పుట్టింది.ఆమెకీ ఆమె పిల్లకీ సగం ఆస్తి రాసివ్వడమే కాక ఆ పిల్లని పెళ్ళి పీటల మీద కూర్చుని మరీ కన్యాదానం కూడా చేశాడు.ధనవంతుడే బలవంతుడు, బలవంతుడే భగవంతుడు, కనుక నోరెత్తలేక నోరుమూసుకున్నారు బంధువులు.

1991 లో శాస్త్రి కంటే ముందు ఆయన భార్యే చనిపోయింది.తరువాత ఆర్నెల్లకి శాస్త్రి కూడా శాస్త్రోక్తంగా పోయాడు.అప్పుడు సికింద్రాబాదులో ఆయన బంగళా మీదికి బంధువులూ మిత్రులూ ఎగబడ్డారు, పరామర్శించడానిక్కాదు, ఏది కనబడితే అది దొరకబుచ్చుకోవడానికి.ఫర్నిచరూ, దిండ్లూ, బొమ్మలూ, పెన్నులూ, టేప్‌రికార్డరు, టీవీ, ఇల్లు అలుక్కునే మురికి గుడ్డ, చీపురు అనే తేడా లేకుండా దొరికినవాళ్ళు దొరికినట్టుగా గంటవ్యవధిలో ఊడ్చిపారేసి లూటీచేశారు.అందులో కొంత కసి కూడా ఉంది.తమపిల్లలెవరినీ శాస్త్రి దత్తు తీసుకోలేదనే అక్కసు ! తరువాత ఆయనగారి అక్రమ కూతురు వాళ్ళందరి ఇళ్ళకీ తన బలగంతో వెళ్ళి ఎంత వీలైతే అంత తిరిగి స్వాధీనం చేసుకుంది.

అపుత్రకుడుగా చనిపోయిన శాస్త్రి వీలునామా ఏమీ రాయలేదు.అందుచేత మిగిలిన ఆస్తి యావత్తూ చట్టప్రకారంగా ఆయన అన్నయ్య అయిన శర్మ (రేపల్లె) కి స్వాధీనం చేశారు.శర్మ కూడా ఆ తరువాత కొన్నేళ్ళకి పోయాడు.

0 వ్యాఖ్యలు: