4.2.07
శవాల శర్మ కథ
12:56 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
గుంటూరులో చలపాయిగారి ఇంటికి అల్లంత దూరంలోనే ఉండేది శవాల శర్మగారి ఇల్లు. శవాల శర్మ అనే పేరు వింటూనే ఆశ్చర్యపోయాను. బ్రాహ్మల్లో శవాలు మోసేవారెవరుంటారా ? అని ! శవాల శర్మగారికి ఆ పేరు రావడానికి కారణం శవాలు మొయ్యడం కాదట. ఆయనగారి అసలు పౌరుష నామం "సిపాయి శర్మ". ఎందుకంటే ఆయనకి చదువు గట్టిగా పట్టుబడలేదు. రెండో ప్రపంచ యుద్ధానికని బ్రిటీషు ప్రభుత్వం అదనంగా బలగాల్ని మోహరించాలనుకున్నప్పుడు చాలా మంది ఆంధ్రులు సైన్యంలో చేరారు. వారిలో శర్మగారొకడు. శర్మగారు ఈజిప్టు వెళ్ళి సాధారణ సిపాయి హోదాలో యుద్ధంలో పోరాడాడు. అలనాటి కురు పాండవ యుద్ధంలో లాగానే ఈజిప్టు యుద్ధంలో కూడా సైనికులు రాత్రిపూట పోరాటం నుంచి విరమించి విశ్రాంతి తీసుకునేవారు. తిరిగి తెల్లవారుతూనే పోరాటం మొదలు. అలాంటి సందర్భంలో ఇరుపక్షాలకూ చెందిన మిగతా సైనికులంతా ప్రగాఢనిద్రా పరిష్వంగంలో సేదదీరే సమయంలో శవాల శర్మగారూ ఆయనగారి పాకిస్తానీ మిత్రుడైన జబ్బార్ ఇద్దరూ మేల్కుని ఉండి యుద్ధరంగంలో చచ్చిపడి ఉన్న సైనికుల ఒంటిమీది ఉంగరాలు గొలుసులూ కంకణాలూ పర్సులూ కాజేసేవారు. అలా కాజేసిన సొత్తు ఎలా భద్రపరిచి ఇండియాకి తెచ్చారో తెలీదు. మొత్తం మీద రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ చరిత్ర ఒక మలుపు తిరిగింది. సిపాయి శర్మగారి జాతకం కూడా ఓ మలుపు తిరిగింది. ఆయన ప్రతిష్ఠాత్మకమైన బ్రాడీపేట ప్రాంతంలో వెయ్యి గజాల ఇల్లు కట్టించి అక్కడే స్థిరపడ్డాడు. ఈ సంఘటన తరువాత ఆయన పౌరుష నామధేయం శవాల శర్మగా మారి పోయింది. ఆయన మిత్రుడికి కూడా పాకిస్తాన్వారు "శవాల జబ్బార్" అని పేరుపెట్టారో లేదో మనకి తెలీదు.
