25.9.06
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం (Direct Democracy) రోజులు
11:06 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
రెండో ప్రపంచ యుద్ధం మూలంగా మఱ్ఱిపూడి గ్రామ పంచాయితీకి 5 సంవత్సరాల పాటు ఎన్నికలే లేవు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత రాజ్యాంగం అన్నారు. అలా అలా ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చాయి. సుందర రామరాజుగారనే క్షత్రియుడే తన పదవీ కాలానికి మించి మరో పదేళ్ళ పాటు ఆ సమయంలో సర్పంచిగా ఉన్నారు. చివరికి 1953లో ఎన్నికలు ప్రకటించినప్పుడు శ్రీ వక్కలగడ్డ వెంకట నారాయణగారనే వైశ్యుడు రామరాజుగారి పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఈ వెంకటనారాయణగారికే తాడేపల్లి వెంకటేశ్వర్లుగారు పోలింగ్ ఏజంటుగా వ్యవహరించారు.
మఱ్ఱిపూడి అగ్రహారం కావడాన అక్కడ అధిక సంఖ్యాకులైన వోటర్లు బ్రాహ్మణులే. పైగా గొప్ప ఆస్తిపరులు కూడా. అయితే వారికి ఎన్నికల్లో నిలబడే ధైర్యం ఉండేది కాదు సరికదా, కనీసం వోటేసే ధైర్యం కూడా ఉండేది కాదు. దీనికి జొన్నలగడ్డ సూర్యనారాయణగారొక ఉదాహరణ. ఆయన మఱ్ఱిపూడి ప్రాథమిక పాఠశాలకి హెడ్మాస్టరుగా పనిచేశారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి పాటించేవారు. అంటే వోటర్లందరూ ఒకచోట సమావేశమై ఎవరికిష్టమైన అభ్యర్థికి వారు అక్కడికక్కడే చెయెత్తడమన్నమాట. "ఆయనకి చెయ్యెత్తితే ఈయనకి కోపం.ఈయనకి చెయ్యెత్తితే ఆయనకి కోపం. ఎందుకొచ్చిన గోల ?" అని జొన్నలగడ్డ సూర్యనారాయణగారు ఇద్దరికీ చెయ్యెత్తారట. ఆయనొక్కడే కాదు, ఆయనలాంటివారు చాలామంది ఉండేవారు. కాని మాలవాడల్లోని జనమంతా వక్కలగడ్డ వెంకటనారాయణగారికే వోటిచ్చారట. అంతిమంగా ఆయనే గెలిచాడు.
ఆ విధంగా, మఱ్ఱిపూడిలో బ్రాహ్మణులెప్పుడూ ఎన్నికల వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనలేదు. మఱ్ఱిపూడి సర్పంచి పదవిని తర్వాతి కాలంలో షెడ్యూల్డు కులాలకి రిజర్వు చెయ్యడం జరిగింది. 1992 నాటికి ఒకటో, రెండో మినహా బ్రాహ్మణ కుటుంబాలన్నీ అదృశ్యమైపోయాయి. ఎక్కువమంది అమెరికాకి వలసపోయారు. అయినా నేటి గుంటూరు నగరంలో మాత్రం కొన్ని కుటుంబాలు ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తాయి.
