27.9.06
ఆనాటి ఒంగోలు పట్టణం
5:01 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
వెంకటేశ్వర్లుగారు అయిదో తరగతీ ఆరో తరగతీ ఇప్పటి ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలులో చదివారు. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా అనే పేరు లేదు. ఆ పట్టణం కూడా గుంటూరులాగానే కృష్ణా జిల్లాలో భాగంగా ఉండేది. ప్రకాశం జిల్లాలో దక్షిణ ప్రాంతం నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండేది. మొత్తం మీద కోస్తా ఆంధ్రలో విశాఖపట్నం నుంచి నెల్లూరు దాకా నాలుగే జిల్లాలు.(రెండు గోదావరి జిల్లాలు లేవు, ఒక్కటే)
ఆ రోజుల్లో ఒంగోలు ఇప్పటంత పెద్ద పట్టణం కాదు. బస్స్టాండు దాటితే ఊరు ఉండేది కాదు. సంతపేటలోనయితే పగలు కూడా దొంగలు కొట్టేలా ఉండేదిట పరిస్థితి. నిజానికి దేశమంతా అలాగే ఖాళీగా ఉండేది. ఎందుకంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా కేవలం 2 కోట్ల 40 లక్షలు మాత్రమే కనుక. వెంకటేశ్వర్లుగారు ఆరో క్లాసు చదివింది అక్కడి A.B.M.హైస్కూల్లో. అది ఇప్పుడు కాలేజి అయింది. ఆ స్కూలు ఆ రోజుల్లో వందెకరాలకంటే ఎక్కువ స్థలం కలిగి ఉండేదిట.
అసలు ఇప్పటి ఒంగోలు పట్టణ విస్తీర్ణంలో సగం భూమి ఆ రోజుల్లో "ధారా" కుటుంబానికి చెందిన Estate అట. సదరు ధారావారికి ఆ ఊళ్ళో మొన్నమొన్నటి దాకా ఒక పొగాకు క్యూరింగ్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. దాన్ని ఆ వంశానికి చెందిన చిట్టచివరి వారసుడైన ధారా శంకరశాస్త్రిగారు ఇటీవలే (1998 ప్రాంతంలో)10 కోట్ల రూపాయలకి అమ్మేశారని తెలుస్తోంది. శంకరశాస్త్రిగారు ఇంకా ఉన్నారో, లేరో తెలియడంలేదు. శంకరశాస్త్రిగారి తండ్రిగారైన ధారా గోపాలకృష్ణయ్యగారు ఒంగోలు పట్టణానికి ఏకధాటిగా 16 సంవత్సరాల పాటు మునిసిపల్ చైర్మన్గా పనిచేశారని వెంకటేశ్వర్లుగారు చెప్పేవారు.
ఒంగోలులో వైదిక బ్రాహ్మలకీ నియోగి బ్రాహ్మలకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఒక వైదీకి పేరు ఏదైనా వీథికి పెడితే వెంటనే మునిసిపల్ కౌన్సిల్లో మర్నాడు హోరాహోరీ యుద్ధం. మళ్ళీ ఒక నియోగి పేరు ఇంకో వీథికి పెడుతూ మునిసిపాలిటీ నిర్ణయం ప్రకటిస్తేనే ఆ గొడవ సద్దుమణిగేది. అలా పోటాపోటీగా పెట్టిన వైదీకి నియోగి పేర్లతో ఒంగోలు నిండిపోయింది.
