కీ.శే.తాడేపల్లి వెంకటేశ్వర్లుగారు (42వ ఏట) మా నాన్నగారు 1929-30 ప్రాంతంలో గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర మఱ్ఱిపూడి అనే గ్రామంలో జన్మించారు. బాపట్ల, బందరు (నేటి మచిలీపట్నం), ఒంగోలు, గుంటూరు పట్టణాల్లో విద్యాభ్యాసం చేసి, మద్రాసులో LL.B. చదివారు. అనంతరం 1960 లో ఇండియన్ బ్యాంకులో చేరి బ్రాంచి మేనేజరుగా, ఆ సంస్థ యొక్క హైదరాబాదు జోన్కి Corporate Attorney గా సేవలందించి 1991 లో గుంటూరు జిన్నాటవర్ బ్రాంచి నుంచి పదవీ విరమణ చేశారు. తరువాత 1994 జూన్ 25 న హృదయకోశ రుగ్మతతో కన్నుమూశారు.
మా నాన్నగారి చివరి సంవత్సరాల్లో తన చిన్ననాటి సంగతులెన్నో నాతో ముచ్చటిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో నేను స్నాతకోత్తరం (PG) లో ఉత్తీర్ణుణ్ణయి నిరుద్యోగిగా మఱియు వివాదాస్పద వ్యక్తిగా కాలం గడుపుతూ ఉండేవాణ్ణి. మా అమ్మా, నాన్నగార్లతో కలిసి ఆనాడు గుంటూరులో గడిపిన నిరుద్యోగ జీవితమే నాకు మిగిలిపోయిన మధుర స్మృతి.
మా నాన్నగారు నాతో చెప్పిన తన జీవిత విశేషాల్లో అత్యంత ఆసక్తికరమైన భాగాలు కొన్నింటిని ఒకటొకటిగా ఇక్కడ టపా చేస్తున్నాను.
